ఒడిశా: దుర్గ్-పూరీ ఎక్స్ప్రెస్లో మంటలు; ప్రయాణికుల హడల్
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు పెను విషాద పీడకలను మరిచిపోక ముందే వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని నౌపడా జిల్లా దుర్గ్పురి ఎక్స్ప్రెస్లో గురువారం కోచ్లో స్వల్పంగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ధృవీకరించారు. బ్రేక్లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల బ్రేక్ ప్యాడ్లకు మంటలు అంటుకున్నాయి. మంటలు బ్రేక్ ప్యాడ్లకే పరిమితమయ్యాయి. దీని వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
కోచ్ నుంచి పొగలు రావడంతో పరుగులు తీసిన ప్రయాణికులు
దుర్గ్పురి ఎక్స్ప్రెస్ గురువారం సాయంత్రం ఖరియార్ రోడ్ స్టేషన్కు చేరుకోగానే రైలులోని బి3 కోచ్లో పొగలు కనిపించాయని అధికారులు వెల్లడించారు. రైల్వే అధికారులు గంటలోపే సమస్యను సరిచేయడంతో రైలు రాత్రి 11గంటలకు స్టేషన్ నుంచి బయలుదేరిందని చెప్పారు. బోగి నుంచి పొగలు రావడంతో చాలామంది ప్రయాణికులు రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత ప్రమాద తీవ్రత అంతగా లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు దుర్ఘటనలో 288 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 1,100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు పరస్పరం ఢీకొన్నాయి.