ఫుడ్ బిల్లు విషయంలో పుట్టినరోజు వేడుకల్లో గొడవ; యువకుడిని హత్య చేసిన నలుగురు స్నేహితులు
పుట్టినరోజు పార్టీలో ఫుడ్ బిల్లును పంచుకోవడంలో వివాదం తలెత్తడంతో 20ఏళ్ల యువకుడిని అతని నలుగురు స్నేహితులు హత్య చేశారు. హత్య చేసిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. తన స్నేహితులను పుట్టిన రోజుకు పిలిచి, వారి చేతిలోనే అతడు హత్యకు గురికావడం గమనార్హం. ఈ ఘటన గతవారం ముంబైలోని గోవండిలోని బైగన్వాడి ప్రాంతంలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్కు చెందిన ఇద్దరి నిందితులు షారుక్, నిషార్లను అరెస్ట్ చేసిన పోలీసులు, మైనర్ నిందితులను జువైనల్ హోంకు తరలించారు. బాధితుడు సాబీర్ అన్సారీ మే 31న ధాబాలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు. అక్కడ ఫుడ్ బిల్లు దాదాపు రూ. 10,000 వచ్చింది.
పదునైన ఆయుధాలతో దాడి
నలుగురు నిందితులు సబీర్కు డబ్బు తర్వాత ఇస్తామని చెప్పడంతో సబీర్ ఫుడ్ బిల్లు చెల్లించి ఇంటికి తిరిగి వచ్చాడు. మధ్యాహ్నం 2గంటల సమయంలో, సబీర్ తన డబ్బు కోసం నిందితుడు షారుక్, అతని మరో ముగ్గురు స్నేహితుల వద్దకు వెళ్లాడు. అయితే వారు బెదిరించి, డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు. సబీర్ అక్కడి నుంచి వెళ్లి సంఘటన గురించి తన మరో స్నేహితుడికి తెలియజేశాడు. ఆ తర్వాత రాత్రి 8గంటల సమయంలో శివాజీ నగర్ ప్రాంతంలోని పాఠశాల సమీపంలో పార్టీ చేసుకున్న వారితో మాట్లాడటానికి సబీర్ తన ఇతర స్నేహితులతో కలిసి వచ్చాడు. ఈ క్రమంలో సబీర్ను నిందితులు దుర్భాషలాడారు. అంతేకాదు,పదునైన ఆయుధంతో సబీర్ పై దాడి చేశారు. అతనికి తీవ్ర గాయాలై చనిపోయాడు.