Kerala: కేరళలో సీఎం,మాజీ ఆర్థిక మంత్రి ఇస్సాక్ తదితరులకు ఈడీ నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో పాటు మాజీ ఆర్థిక మంత్రి టి.ఎం. థామస్ ఐజాక్కు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA)కింద సీఎం కార్యదర్శి అబ్రహం సహా పలువురు ఉన్నతాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కేరళ రాష్ట్రంలోని మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధులు సమీకరించే ప్రభుత్వ సంస్థ అయిన కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డ్(KIIFB)జారీ చేసిన మసాలా బాండ్ల వ్యవహారంలో ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. విదేశీ మారక ద్రవ్య నియమాలను ఉల్లంఘిస్తూ ఈ బాండ్ల ద్వారా నిధులు సేకరించారని,ఈ ప్రక్రియలో FEMA మార్గదర్శకాలను పాటించలేదని ఈడీ ఆరోపిస్తోంది. దీంతో KIIFB చేపట్టిన నిధుల సమీకరణ విధానంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ పాత్రపై ప్రత్యేకంగా దృష్టి
ఈకేసులో మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ పాత్రపై ప్రత్యేకంగా దృష్టి నెలకొంది. ఆయన మంత్రిగా ఉన్న 2018-19 కాలంలోనే KIIFB లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వేదికగా మసాలా బాండ్లను జారీ చేసి విదేశాల నుంచి నిధులు సమీకరించింది. ఈమొత్తాన్ని రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల కోసం వినియోగించినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే ఆ నిధుల సేకరణ, నిర్వహణలో FEMA నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, చట్టపరమైన ప్రక్రియలు పాటించలేదని ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇచ్చిన నోటీసులకు సంబంధించి ఆయా వ్యక్తుల నుంచి త్వరలో సమాధానాలు రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా,సుమారు ₹466కోట్ల విలువైన ఈ వ్యవహారంలో స్వయంగా సీఎంకే నోటీసులు రావడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీస్తోంది.