Page Loader
Delhi: దిల్లీ ఎయిర్‌పోర్టులో పొగమంచు ప్రభావం.. 30 విమానాలు రద్దు
దిల్లీ ఎయిర్‌పోర్టులో పొగమంచు ప్రభావం.. 30 విమానాలు రద్దు

Delhi: దిల్లీ ఎయిర్‌పోర్టులో పొగమంచు ప్రభావం.. 30 విమానాలు రద్దు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2025
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర భారతాన్ని తీవ్ర చలి తన ప్రభావంతో కప్పేస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోవడంతో మంచు గట్టిగా కురుస్తోంది. దిల్లీతో పాటు పలు రాష్ట్రాలను పొగమంచు కమ్మేసి, వాతావరణం మరింత క్లిష్టంగా మారింది. ఈ పరిణామాల వల్ల విమాన, రైల్వే సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దిల్లీ ఎయిర్‌పోర్టులో విజిబిలిటీ సున్నాకు చేరుకోవడంతో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఫలితంగా దాదాపు 200కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, 30 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పొగమంచు ప్రభావం వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని, ప్రయాణికులు తమ విమానాల సమయాల గురించి సంబంధిత ఎయిర్‌లైన్లను సంప్రదించాలని దిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

Details

జనవరి 8వరకు మంచు కురిసే అవకాశం

ఇండిగో, ఎయిర్‌ఇండియా సంస్థలు కూడా ప్రయాణికులకు ప్రత్యేక సూచనలను జారీ చేశాయి. కేవలం దిల్లీ మాత్రమే కాకుండా కోల్‌కతా, చండీగఢ్‌, అమృత్‌సర్‌, జైపూర్‌ వంటి ఉత్తర భారతంలోని పలు విమానాశ్రయాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో 25 విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి. ఇక రైల్వే సేవలు కూడా మంచు ప్రభావంతో నెమ్మదిగా సాగుతున్నాయి. దిల్లీకి వెళ్లే దాదాపు 50కు పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌, కర్నాల్‌, గాజియాబాద్‌ ప్రాంతాల్లో ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి ఉండటంతో ట్రాఫిక్‌ సమస్యలు తీవ్రమయ్యాయి. వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసి, జనవరి 8వ తేదీ వరకు మంచు కురుస్తుందని అంచనా వేస్తోంది.