కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా 200యూనిట్లు విద్యుత్ను అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ జూలై 1 నుంచి అమలు చేస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. కర్ణాటకలోని అర్హులైన పౌరులందరికీ 200 యూనిట్ల వరకు 'ఉచిత విద్యుత్' ప్రకటించారు. అయితే తాజాగా ఇంధన శాఖ 'గృహ జ్యోతి' పథకం కింద అందించే ఉతిత విద్యుత్ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. పౌరులు తప్పనిసరిగా సేవా సింధు పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఈ పథకాన్ని ఎవరూ దుర్వినియోగం చేయడానికి అనుమతించకుండా గరిష్ట సంఖ్యలో పౌరులకు ప్రయోజనం చేకూర్చేలా మార్గదర్శకాలను రూపొందించినట్లు వెల్లడించింది.
బకాయిలు చెల్లిస్తేనే ఉచిత విద్యుత్
ఈ సదుపాయం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని, వ్యాపార కేంద్రాలకు కాదని పేర్కొంది. ఈ పథకం పొందాలంటే, బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి అని మార్గదర్శకాల్లో చెప్పింది. ప్రస్తుతం ఉన్న కుటీర జ్యోతి, భాగ్య జ్యోతి లబ్ధిదారులను కూడా గృహ జ్యోతి పథకంలో విలీనం చేస్తారు. ఉచిత విద్యుత్ పథకాన్ని పొందాలనుకునే వారు జూన్ 2023 వరకు తమ మునుపటి బకాయిలను తప్పనిసరిగా క్లియర్ చేసి ఉండాలి. వినియోగదారు అలా చేయడంలో విఫలమైతే, అటువంటి ఇన్స్టాలేషన్లకు విద్యుత్ సరఫరా డిస్కనెక్ట్ చేయబడుతుందని విద్యుత్ శాఖ వెల్లడించింది. సింధు సేవలో రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభమయ్యేది ఇంకా చెప్పలేదు. అద్దెకు ఉంటున్న వారు కూడా ఈ పథకానికి అర్హులని బెస్కామ్ అధికారులు తెలిపారు.