Page Loader
ఈటల హత్యకు కౌశిక్ రెడ్డి కుట్ర.. ఈటల సతీమణి జమున సంచలన ఆరోపణలు
ఈటల సతీమణి జమున సంచలన ఆరోపణలు

ఈటల హత్యకు కౌశిక్ రెడ్డి కుట్ర.. ఈటల సతీమణి జమున సంచలన ఆరోపణలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 27, 2023
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ జనతా పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హత్యకు కుట్ర చేస్తున్నారని ఈటల జమున సంచలన ఆరోపణలు చేశారు. రూ.20 కోట్లు సుపారీ ఇచ్చి ఈటల అడ్డును తొలగించుకుంటామని భారత రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అన్నట్లు తమకు సమాచారముందని ఆమె వెల్లడించారు. తమ కుటుంబాన్ని భయబ్రాంతులకు గురి చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఈటల నివాసంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈటలను చంపేస్తామని బెదిరిస్తే తాము భయపడబోమని జమున స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి మాటల వెనక ముఖ్యమంత్రి కేసీఆర్‌ హస్తం ఉందన్నారు.

details

మహిళల పట్ల అసభ్య పదజాలం వాడితే చెప్పుల దండలు వేస్తారు : జమున 

హుజూరాబాద్‌ ప్రజలను వేధించడానికి కౌశిక్ రెడ్డిని ఉసిగొల్పారని, హుజూరాబాద్‌లో ఎన్నో అరాచకాలకు కౌశిక్ కేరాఫ్ అడ్రస్ గా మారాడని జమున ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల పట్ల అసభ్య పదజాలం వాడితే చెప్పుల దండలు వేస్తామని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అమరవీరుల స్తూపాన్ని కౌశిక్‌ రెడ్డి కూల గొట్టించడాన్ని తప్పుబట్టిన జమున, తమ కుటుంబంలో ఎవరికి నష్టం జరిగినా దానికి కేసీఆరే బాధ్యత వహించాలన్నారు. బీజేపీలో ఈటల రాజేందర్‌ సంతృప్తిగానే ఉన్నారని, పార్టీ మారేది లేదని ఇప్పటికే ఈటల స్వయంగా తేల్చి చెప్పారని ఆమె గుర్తు చేశారు.