Farmers Protest: నేడు రైతులతో కేంద్రం నాలుగో దఫా చర్చలు.. MSPపై ఆర్డినెన్స్కు అన్నదాతల డిమాండ్
సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలుపుతున్న రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఆదివారం నాలుగో దఫా చర్చలు జరగనున్నాయి. ప్రధానంగా కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంతకుముందు రైతులు, ప్రభుత్వం మధ్య మూడు దఫాలు చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు సఫలం కాలేదు. డిమాండ్ల సాధనే లక్ష్యంగా చలో దిల్లీ పాదయాత్రకు వచ్చిన రైతుల పోరాటం ఆదివారానికి ఆరో రోజుకు చేరుకుంది. పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో ప్రస్తుతం రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రైతులను దిల్లీ లోనికి రాకుండా అడ్డుకునేందుకు సరిహద్దుల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించడంతో పాటు, రైతులను శాంతింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
రైతుల డిమాండ్లు ఇవే
1. అన్ని పంటల కొనుగోళ్లకు MSP హామీ చట్టాన్ని వర్తింపజేయాలి. 2. స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం పంటల ధరలు నిర్ణయించాలి. అన్ని పంటల సగటు ఉత్పత్తి వ్యయం కంటే MSP యాభై శాతం ఎక్కువ ఉండాలి. 3. రైతులు, రైతు కూలీల రుణాలను మాఫీ చేయాలి. 4. 60ఏళ్లు పైబడిన రైతులకు రూ.10,000పెన్షన్ ఇవ్వాలి. 5. భూసేకరణ చట్టం 2013ని మళ్లీ అమలు చేయాలి. 6. లఖింపూర్ ఖేరీ ఘటనలో దోషులను శిక్షించాలి. నిందితుల బెయిల్ను రద్దు చేయాలి. 7. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను నిషేధించాలి. 8. విద్యుత్ సవరణ బిల్లు 2020ని రద్దు చేయాలి. 9. MNREGA కింద, ప్రతి సంవత్సరం 200రోజుల పని, రోజూవారీగా రూ. 700వేతనం ఇవ్వాలి.
రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి
10. రైతు ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. ఒప్పందం ప్రకారం క్షతగాత్రులకు రూ.10లక్షల పరిహారం అందించాలి. దిల్లీ మోర్చాతోపాటు దేశవ్యాప్తంగా అన్ని ఉద్యమాల సందర్భంగా నమోదైన కేసులన్నింటినీ రద్దు చేయాలి. 11. నకిలీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు విక్రయించే కంపెనీలపై కఠిన చట్టాలు చేయాలి. ప్రభుత్వమే పంటల బీమా చేయించాలి. 12. మిర్చి, పసుపు, ఇతర మసాలా దినుసుల కోసం జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలి. 13. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ను అమలు చేయడం ద్వారా గిరిజనుల భూములను దోచుకోవడం అరికట్టాలి. హర్యానాలో ఇంటర్నెట్ నిషేధం రైతుల ఉద్యమం కారణంగా హర్యానాలోని ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఫిబ్రవరి 19 అర్ధరాత్రి 12గంటల వరకు నిషేధించారు.