
Deoghar Accident: జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
జార్ఖండ్లోని డియోఘర్ జిల్లాలోని మోహన్పూర్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్వారియాలతో వెళ్తున్న బస్సు, గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. పోలీసుల ప్రకారం, ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన మోహన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అడవి సమీపంలో ఉదయం 4:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వెళ్తున్న బస్సు, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ఘోరంగా ఈ ప్రమాదం జరిగిందని మోహన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి ప్రియరంజన్ కుమార్ తెలిపారు. ప్రమాదానికి గురైన వారిని అంబులెన్సుల ద్వారా మోహన్పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు(CHC) తరలించి చికిత్స అందిస్తున్నారు.
Details
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ
మృతుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ప్రియరంజన్ కుమార్ నేతృత్వంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మోహన్పూర్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్కు ఘటన సమాచారం అందించారు. ఈ ఘటనపై డియోఘర్ ఎంపీ నిషికాంత్ దూబే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'నా లోక్సభ నియోజకవర్గమైన డియోఘర్లో శ్రావణ మాసం సందర్భంగా కన్వర్ యాత్రలో పాల్గొన్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురై మరణించారని తెలిసి చాలా బాధగా ఉంది. బాబా బైద్యనాథ్ వారి కుటుంబాలకు ఈ నష్టాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.