Page Loader
Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై క్షుణ్నంగా ఫీల్డ్ వెరిఫికేషన్.. ప్రతి 200 ఇళ్లకు ప్రత్యేకాధికారి నియామకం
ఇందిరమ్మ ఇళ్ల పథకంపై క్షుణ్నంగా ఫీల్డ్ వెరిఫికేషన్.. ప్రతి 200 ఇళ్లకు ప్రత్యేకాధికారి నియామకం

Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై క్షుణ్నంగా ఫీల్డ్ వెరిఫికేషన్.. ప్రతి 200 ఇళ్లకు ప్రత్యేకాధికారి నియామకం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2025
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్‌ను సక్రమంగా అమలు చేయాలని గట్టి సంకల్పంతో ముందుకు సాగుతోంది.

అర్హులైనవారికే న్యాయంగా ఇండ్లు లభించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో లబ్ధిదారులను ఖచ్చితంగా గుర్తించేందుకు ఒక ప్రణాళికాబద్ధమైన విధానాన్ని తీసుకొస్తోంది.

ఇందుకు అనుగుణంగా, ఈ నెల 30వ తేదీలోపు ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేయాలంటూ క్షేత్రస్థాయిలోని అధికారులకు సూచనలు జారీ చేసింది.

వివరాలు 

ఏప్రిల్ 30 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ 

మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియలో పూర్తిస్థాయి పారదర్శకత ఉండేలా చూడాలని తెలిపారు.

ఫీల్డ్ స్థాయిలో దరఖాస్తుల పరిశీలనను ఏప్రిల్ 30వ తేదీకి ముందుగానే ముగించాలని అధికారులకు ఆదేశించారు.

లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలో ప్రతి దశలో ప్రభుత్వ సహాయాన్ని అందించాల్సిందిగా సూచించారు.

వివరాలు 

ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకాధికారి నియామకం 

ఇందిరమ్మ పథకంలో మొదటి విడత లబ్ధిదారుల ఎంపికను నిష్పాక్షికంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

ఆర్థికంగా వెనుకబడిన పేదలకు సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక్కో ఇంటికీ రూ. 5 లక్షల సబ్సిడీ అందించనుంది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల వరకు మంజూరయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈ పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఒక్కో నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు.

వివరాలు 

ఇందిరమ్మ కమిటీ ద్వారా అర్హుల ఎంపిక 

ప్రతి గ్రామంలో,మున్సిపల్ వార్డులో ఉన్న ఇందిరమ్మ కమిటీల ద్వారానే అర్హుల జాబితాను తుది మంజూరుకు తీసుకురావాలని మంత్రి స్పష్టంగా పేర్కొన్నారు.

కమిటీ ఆమోదించిన ప్రతి 200 ఇళ్లకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి, ఏప్రిల్ 30 లోపు మరొకసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలని తెలిపారు.

పైలెట్ గ్రామాలుగా ఎంపికైన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ. 1 లక్ష విడుదల చేసిందని పేర్కొన్నారు.

వివరాలు 

ఎల్ఆర్ఎస్ సదుపాయంపై 25% రాయితీ 

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణలో ప్రజలకు ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం 25 శాతం రాయితీని అందించిందని మంత్రి తెలిపారు.

అలాగే ఈ దరఖాస్తులకు గడువును ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించామని చెప్పారు.

ఇప్పటికే ఆమోదం పొందిన దరఖాస్తులకు సంబంధించి ఫీజులు వసూలు చేసి, వాటిని క్రమబద్ధీకరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.