
Pahalgam Attack: జమ్మూలో భీకర ఎన్కౌంటర్.. పహల్గాం దాడి ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీనగర్లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ 'జమ్మూకశ్మీర్ ఎన్కౌంటర్'లో ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చినార్ కోర్ ప్రకటించింది. అయితే వీరు గతంలో పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులేనా అన్న దానిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ ఆపరేషన్ను 'ఆపరేషన్ మహదేవ్' పేరుతో జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగున్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు గత నెల రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా సోమవారం ఉదయం దాచిగమ్ అటవీ ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు.
Details
ముగ్గురు ఉగ్రవాదులు మృతి
వెంటనే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఆ సమయంలో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. వారంతా లష్కరే తయిబా సంస్థకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న బైసరన్ లోయ వద్ద ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులకు పాల్పడి, 25 మంది పర్యాటకులతో పాటు ఒక కశ్మీరీ కూడా ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆ తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దాడి వెనుక లష్కరే తయిబా అనుబంధ సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు భద్రతా వర్గాలు ప్రాథమికంగా నిర్ధారించాయి.