కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు ఇప్పుడు 79ఏళ్లు. తన తండ్రి తుదిశ్వాస విడిచినట్లు చాందీ కుమారుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఊమెన్ చాందీ బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషయమించడంతో తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఉమెన్ చాందీ మృతికి సంతాపంగా కేరళ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలను ప్రకంటించింది. తన యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఉమెన్ చాందీ 12సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. తన 27ఏళ్ల వయస్సులో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004-2006, 2011-2016 మధ్యకాలంలో కేరళకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
కేరళ కాంగ్రెస్ ట్వీట్
పుతుపల్లికి 50ఏళ్లకు పైగా ఊమెన్ చాందీనే ఎమ్మెల్యే
1970లో ఊమెన్ చాందీ తొలిసారిగా తన సొంత నియోజకవర్గం పుతుపల్లి నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1970కి ముందు కాంగ్రెస్కు పుతుపల్లిలో గెలుపు అవకాశాలు చాలా తక్కువ. ఓడిపోయే సీటు అనుకొని చాందీకి పార్టీ కేటాయించింది. అందరినీ ఆశ్చర్యపరిచి ఆయన విజయం సాధించారు. వరుసగా 11ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. 2020లో పుతుపల్లి ఎమ్మెల్యేగా 50ఏళ్ల పూర్తి చేసుకొని రికార్డు సృష్టించారు. చాందీ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. ఆయన కాంగ్రెస్లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, ఆ పార్టీలోనే కొనసాగారు. ఊమెన్ చాందీకి పుతుపల్లి అంటే చాలా ఇష్టం. ఆయనకు ఎన్ని పనులున్నా, ప్రతి శనివారం పుతుపల్లికి వెళుంటారు. పుతుపల్లిలో ఆయన దాదాపు అందరినీ పేరు పెట్టి పిలుస్తారని స్థానికులు చెబుతుంటారు.