Page Loader
Girija Vyas: సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు,మాజీ కేంద్రమంత్రి గిరిజా వ్యాస్‌ కన్నుమూత 
సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు,మాజీ కేంద్రమంత్రి గిరిజా వ్యాస్‌ కన్నుమూత

Girija Vyas: సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు,మాజీ కేంద్రమంత్రి గిరిజా వ్యాస్‌ కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
May 01, 2025
11:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ గిరిజా వ్యాస్ గురువారం అహ్మదాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి మునుపటితో పోల్చితే విషమంగా మారింది. మార్చి 31న ఉదయపూర్‌లోని తన నివాసంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో హారతి ఇస్తుండగా, ఆమెకు మంటలు అంటుకోవడంతో తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. దాదాపు 90 శాతం వరకు కాలిన గాయాలతో బాధపడుతున్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి అహ్మదాబాద్‌లోని జైడస్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, చివరకు ప్రాణాలు కోల్పోయారు. ఆమె పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు ఉదయపూర్‌లోని ఇంటికి తీసుకెళ్లనున్నట్లు తెలియజేశారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

వివరాలు 

కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం

రాజకీయ, సామాజిక,విద్యారంగాల్లో గిరిజా వ్యాస్ అందించిన సేవలు ఎనలేనివిగా అభివర్ణించవచ్చు. ఆమె జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సేవలందించడమే కాకుండా,పలు సార్లు లోక్‌సభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా విద్య, మహిళల సాధికారత, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఆమె మృతిపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, నేతలు సచిన్ పైలట్, గోవింద్ సింగ్ తదితరులు ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

వివరాలు 

విద్య, రాజకీయ, సామాజిక రంగాల్లో ఆమె కృషి మరువలేనిది 

అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ, గిరిజా వ్యాస్ మృతి అత్యంత దురదృష్టకరమని, ఆమె విద్య, రాజకీయ, సామాజిక రంగాల్లో చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఆమె మరణం అందరికీ షాక్‌ లాంటిదన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ మాట్లాడుతూ గిరిజా వ్యాస్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని అన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఆమె మృతి వార్తను బాధాకరంగా అభివర్ణించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

వివరాలు 

గిరిజా వ్యాస్‌ గురించి.. 

డాక్టర్ గిరిజా వ్యాస్ 1946, జూలై 8న కృష్ణ శర్మ,జమునా దేవి వ్యాస్ దంపతులకు జన్మించారు. తత్వశాస్త్రంలో డాక్టరేట్‌ పట్టా పొందిన ఆమె,మోహన్ లాల్ సుఖాడియా యూనివర్శిటీ, డెలావేర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేశారు. 1985లో భారత జాతీయ కాంగ్రెస్ తరఫున ఉదయపూర్‌ నుంచి రాజస్థాన్ శాసనసభకు ఎన్నికై 1990 వరకు మంత్రిగా పని చేశారు. 1991లో ఉదయపూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికై పీవీ నరసింహారావు మంత్రివర్గంలో సమాచారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

వివరాలు 

2005లో జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌

1993లో అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఆమె 1996లో రెండోసారి, 1999లో మూడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2001 నుంచి 2004 వరకు రాజస్థాన్ ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలిగా పనిచేశారు. 2005లో యూపీఏ ప్రభుత్వం ఆమెను జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించింది. ఆమె ఆ పదవిలో 2011 ఆగస్టు ఒకటో తేదీ వరకు కొనసాగారు. 2008లో గిరిజా వ్యాస్ రాజస్థాన్ శాసనసభకు తిరిగి ఎన్నికయ్యారు. 2013లో గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.