
Cm chandrababu:ప్రజల వద్దకే పాలన నుంచి హైటెక్ సిటీ వరకు.. చంద్రబాబు సీఎం కుర్చీ అధిష్ఠించి 30 ఏళ్లు పూర్తి
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయాణంలో ఓ ప్రత్యేక మైలురాయిని అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి నేటికి (సెప్టెంబర్ 1) 30 ఏళ్లు పూర్తయింది. సుమారు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్న ఆయన, ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం విశేషంగా నిలుస్తోంది. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తరుణంలో, పార్టీలో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల ఫలితంగా ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. అనంతరం 1995 సెప్టెంబర్ 1న ఆయన తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Details
ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందంజ
చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు, అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర రాజకీయాలపై గాధ చెక్కారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరిపాలనలో విస్తృత సంస్కరణలు చేపట్టారు. 'ప్రజల వద్దకే పాలన', 'జన్మభూమి', 'శ్రమదానం' వంటి పథకాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశారు. ప్రత్యేకించి సాంకేతికతపై ఆయన చూపిన ముందుచూపుతో హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణానికి పునాది వేశారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఐటీ రంగంలో ప్రపంచ పటంలో నిలబెట్టింది. అదేవిధంగా, ఆయన హయాంలోనే ఏర్పడిన డ్వాక్రా సంఘాలు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు మార్గం సుగమం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు కీలక భూమిక వహించారు.
Details
పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర
కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో, ప్రధానుల ఎంపికలో ఆయన కీలకపాత్ర పోషించారు. అలాగే ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించడంలోనూ చంద్రబాబు చురుకైన పాత్ర పోషించారు. 2004, 2009లో వరుసగా ఓటములు ఎదుర్కొన్న ఆయన పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆ కాలంలో ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం సాగిస్తూ, పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు, రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించి నాలుగోసారి సీఎం కుర్చీ అధిష్ఠించిన ఆయన, ప్రస్తుతం నవ్యాంధ్ర పునర్నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.