
Modi-Pawan Kalyan: దిల్లీలో రేఖా గుప్తా ప్రమాణ స్వీకార వేడుకలో మోదీ, పవన్ మధ్య సరదా సంభాషణ
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సరదాగా ముచ్చటించారు. పవన్ కళ్యాణ్ ధరించిన సంప్రదాయ దుస్తులను గమనించిన మోదీ, ఆయనను ఉద్దేశించి - 'హిమాలయాలకు వెళుతున్నారా పవన్? అంటూ చమత్కరించారు. మోదీ ఈ ప్రశ్న వేయగానే అక్కడున్న నేతలందరూ చిరునవ్వులు చిందించారు.
Details
ఇంకా సమయం ఉందన్న పవన్ కళ్యాణ్
ఈ విషయంపై పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఎప్పుడు కలిసినా సరదాగా మాట్లాడుతారని, ఈరోజు తన ఆహార్యం గురించి ప్రశ్నించారని, హిమాలయాలకు వెళుతున్నారా? అని అడిగారన్నారు. దీంతో తాను ఎక్కడికీ వెళ్లడం లేదని, ఇంకా చాలా పనులు చేయాల్సి ఉన్నాయని సమాధానమిచ్చానని తెలిపారు. హిమాలయాలకు వెళ్లడానికి ఇంకా సమయం ఉందని పవన్ నవ్వుతూ పేర్కొన్నారు.
Details
ఎన్డీయే కూటమికి చెందిన ముఖ్య నాయకులు హాజరు
ఈ ప్రమాణ స్వీకార వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు, ఎన్డీయే కూటమికి చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తదితర నాయకులను ప్రధాని మోదీ ప్రత్యేకంగా పలకరించారు. ప్రధాని మోదీ గతంలోనూ పవన్ కళ్యాణ్ను ప్రశంసించిన విషయం గుర్తుచేసుకోవచ్చు. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-టిడిపి-జనసేన కూటమి విజయానంతరం లోక్సభా పక్షనేతగా మోదీ మాట్లాడారు. ఆ సమయంలో ఆయన ఇక్కడ కూర్చొన్నది పవన్ కాదు, తుపాను అంటూ పవన్ కళ్యాణ్ను ప్రశంసించారు.