Page Loader
అశ్లీల వీడియో కాల్ చేసి కేంద్రమంత్రిని బ్లాక్‌మెయిల్‌ చేసిన ముఠా.. ఇద్దరి అరెస్ట్
కేంద్రమంత్రిని బ్లాక్‌మెయిల్‌ చేసిన ముఠా

అశ్లీల వీడియో కాల్ చేసి కేంద్రమంత్రిని బ్లాక్‌మెయిల్‌ చేసిన ముఠా.. ఇద్దరి అరెస్ట్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 26, 2023
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల సైబర్‌ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. సామాన్యులు సహా ప్రముఖులనూ విడిచిపెట్టట్లేదు. ఈ క్రమంలో అశ్లీల కాల్స్ చేసే ఓ ముఠా ఏకంగా కేంద్రమంత్రికే వీడియో కాల్ చేసింది. అంతటితో ఆగకుండా సెంట్రల్ మినిస్టర్ ను లొంగదీసికునేందుకు ప్రయత్నించారు. పదేపదే అశ్లీలంగా వీడియోకాల్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. ఫలితంగా ముఠాలోని ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ఫోన్ కు వాట్సాప్‌ ద్వారా గత వారం ఓ వీడియో కాల్‌ వచ్చింది. ఎప్పటిలాగే ఫోన్ లిఫ్ట్ చేసిన మంత్రికి అది అశ్లీల వీడియో కాల్‌ అని అర్థమై కాల్ కట్ చేశారు.

details

ప్రత్యేక బృందాలను పంపించి అరెస్ట్ చేసిన దిల్లీ పోలీసులు

వెంటనే వ్యక్తిగత కార్యదర్శిని పిలిపించి ఆయా వివరాలను అందజేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే దిల్లీ పోలీసులు అశ్లీల వీడియో కాల్ పై కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. అక్కడికి ప్రత్యేక బృందాలను పంపించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ (COMMISSIONER OF POLICE) వెల్లడించారు. అసలు ఏం జరిగిందంటే : మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో కేంద్రమంత్రి పర్యటన సందర్భంలో గుర్తు తెలియని నంబర్‌ నుంచి వాట్సాప్ ఫోన్ కాల్ వచ్చింది. కాల్‌ లిఫ్ట్‌ చేసిన వెంటనే అందులోని దృశ్యాలను చూసి మంత్రి ఫోన్ కట్‌ చేశారు.

DETAILS

వీడియో కాల్‌ దృశ్యాలను నెట్టింట పోస్ట్ చేస్తామని మంత్రికి బ్లాక్‌ మెయిల్‌ 

మరోసారి మంత్రి ఫోన్‌కు వేరే నంబర్‌ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి అంతకముందు వీడియో కాల్‌ దృశ్యాలను నెట్టింట పోస్ట్ చేస్తామని బ్లాక్‌మెయిల్‌ చేశారు. ఈ సంఘటనపై మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి(PS) అలోక్‌ మోహన్‌ వివరించారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు నిందితులంతా ఓ ముఠాగా ఏర్పడి అశ్లీల వీడియో కాల్స్‌ చేస్తూ బ్లాక్‌మెయిల్‌ కార్యకలాపాలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర ఆహార శుద్ధి శాఖ, పరిశ్రమల శాఖ, జలశక్తి శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.