Page Loader
Geeta Samota: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళా CISF అధికారిణి గీతా సమోటా
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళా CISF అధికారిణి గీతా సమోటా

Geeta Samota: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళా CISF అధికారిణి గీతా సమోటా

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2025
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో ఒక మహిళా ఆఫీసర్‌గా గీతా సమోట ఒక కొత్త చరిత్రను సృష్టించారు. అసాధారణ ధైర్యంతో కూడిన తన సాహసపూర్వక ప్రయాణం ద్వారా ఆమె ఎవ‌రెస్ట్ పర్వత శిఖరాన్ని ఎక్కిన తొలి CISF మహిళా అధికారిణిగా గుర్తింపుపొందింది. ప్రపంచంలోనే అత్యున్నతమైన 8,849 మీటర్ల ఎత్తున్న ఎవ‌రెస్ట్ శిఖరం ఎక్కడం ఒక గొప్ప ఘనతగా భావిస్తారు. ఈ విజయంపై CISF సీనియర్ అధికారులు గీతా సమోటకు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయము వ్యక్తిగతమే కాకుండా ఇండస్ట్రియల్ సెక్యూరిటీ దళంలో మహిళా శక్తిని ప్రతిబింబిస్తున్నదని వారు పేర్కొన్నారు. పర్వతాలను సమానత్వానికి ప్రతీకలుగా భావించి,అవి లింగంపై ఆధారపడి ఉండకూడదని,కేవలం పట్టుదలతో, ధైర్యంతో ఎవ్వరైనా ఆ శిఖరాలను అధిరోహించగలరని గీతా చెప్పింది.

వివరాలు 

మౌంటెనీరింగ్ అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్‌ పూర్తి 

రాజస్థాన్‌లోని సికర్ జిల్లాకు చెందిన గీతా సమోట పల్లెటూరి నుండి వచ్చారు. చాక్ గ్రామంలోని పేద కుటుంబంలో ఆమె జన్మించింది. ఆమెకు నలుగురు అక్కాచెల్లెలు ఉన్నారు. కాలేజీ విద్యార్థిగా గీతా హాకీ ఆటలో పాల్గొంది, అయితే గాయాల కారణంగా ఆమె క్రీడా కెరీర్‌కు బ్రేక్ పడింది. కానీ కొత్త‌గా ప‌ర్వ‌తారోహ‌ణ‌కు శ్రీకారం చుట్టింది. 2011లో CISFలో చేరి, 2015లో ఔలి ప్రాంతంలో ఉన్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు ట్రైనింగ్ ఇన్స్‌టిట్యూట్‌లో పర్వతారోహణ శిక్షణ పొందింది. 2017లో ఆమె మౌంటెనీరింగ్ అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్‌ను కూడా పూర్తిచేసుకుంది.

వివరాలు 

5,000 మీటర్ల ఎత్తున్న ఐదు పర్వతాలు ఎక్కిన గీత 

2019లో గీతా సమోట ఉత్తరాఖండ్‌లోని సతోపంత్ పర్వతాన్ని (7,075 మీటర్లు) నేపాల్‌లోని లోబోచి పర్వతాన్ని (6,119 మీటర్లు) విజయవంతంగా ఎక్కారు. 2021లో ఎవ‌రెస్ట్ శిఖరాన్ని ఎక్కే ప్రణాళికను సిద్ధం చేసారు. కానీ ఈ ప్రణాళిక అడ్డంకులు ఎదుర్కొన్న తర్వాత, గీతా ఏడు ఖండాల్లోని ఏడు అత్యున్నత పర్వత శిఖరాలను ఎక్కే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆస్ట్రేలియాలోని మౌంట్ కోసిజుకో, రష్యాలోని మౌంట్ ఎల్‌బ్రస్, టాంజానియాలోని కిలిమంజారో, అర్జెంటీనాలోని అకోన్కాగువా వంటి పర్వతాలను కేవలం ఆరు నెలల కాలంలో అధిరోహించారు. ఈ సాహసం సాధించిన తొలి భారత మహిళగా ఆమె గుర్తింపు పొందింది. అదనంగా, లడాఖ్‌లోని రుప్సు ప్రాంతంలో 5,000 మీటర్ల ఎత్తున్న ఐదు పర్వతాలను కూడా విజయవంతంగా ఎక్కారు.