CBSE Exams: సీబీఎస్ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు!
ఈ వార్తాకథనం ఏంటి
విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) గుడ్న్యూస్ చెప్పింది. ఇకపై విద్యార్థులు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు రాయొచ్చని సీబీఎస్ఈ నిర్ణయించింది.
అన్నీ అనుకున్నట్లు సాగితే, ఈ విధానం 2026 నుంచే అమల్లోకి రానుంది.
ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వంలో మంగళవారం స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి, సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్), నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్) ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది.
దీనికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసి, వచ్చే సోమవారం నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నారు
Details
విద్యార్థులపై ఒత్తిడి తగ్గే అవకాశం
ఈ విధానం అమలులోకి వస్తే, విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గనుంది.
అలాగే వారు తమ మార్కులను మెరుగుపర్చుకునే అవకాశాన్ని పొందగలరు. అంతేకాకుండా 2026-27 విద్యా సంవత్సరంలో గ్లోబల్ కరిక్యులమ్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని సీబీఎస్ఈ భావిస్తోంది.
దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో ఒకే విధమైన సిలబస్ అమలులోకి వస్తుంది.
ఏడాదికి రెండు సార్లు నిర్వహించే బోర్డు పరీక్షల్లో విద్యార్థులు ఎక్కువ మార్కులు వచ్చిన పరీక్ష ఫలితాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే రెండు పరీక్షలకు హాజరవ్వడం పూర్తిగా విద్యార్థుల ఐచ్ఛికమే.
జేఈఈ మాదిరిగానే పదో తరగతి, పన్నెండో తరగతి విద్యార్థులు కూడా బోర్డు పరీక్షలకు రెండుసార్లు హాజరవ్వొచ్చు.
Details
2026 నుంచి అమలు
ప్రస్తుతం సీబీఎస్ఈ పదో, పన్నెండో తరగతి పరీక్షలు ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించి, మే నెలలో ఫలితాలను విడుదల చేస్తున్నారు.
ఫెయిలైన విద్యార్థులకు జూలైలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటివరకు ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు, ఆ పరీక్షను రీ-టేక్ చేయడానికి అవకాశం ఉంది. అయితే కొత్త విధానం అమల్లోకి వస్తే, రెండు పరీక్షల మధ్య నిర్ణీత కాల వ్యవధి ఉంటుంది.
అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) ప్రవేశాలపై ఈ కొత్త విధానం ప్రభావం లేకుండా విద్యా క్యాలెండర్ను సరిచేయనున్నారు.
దీని ద్వారా, విద్యార్థులు మరింత సమర్థవంతంగా పరీక్షలకు సన్నద్ధమయ్యే అవకాశం పొందనున్నారు. 2026 నుంచి అమలు కోసం కేంద్రం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.