
DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ 2% పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్సును (DA) 2 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. అనంతరం కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు.
పెరిగిన డీఏ జనవరి 1, 2024 నుంచి అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ సవరణతో డీఏ మొత్తం బేసిక్ శాలరీలో 53 శాతం నుంచి 55 శాతానికి పెరుగనుంది.
దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం పెరగనుంది.
Details
66.55 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం
డీఏ పెంపు వల్ల 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 66.55 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగనుంది.
గతంలో 2023 జులైలో డీఏను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. సాధారణంగా కేంద్రం ప్రతి ఏడాది రెండుసార్లు డీఏను సవరిస్తూ ఉంటుంది.
పెరుగుతున్న జీవన వ్యయాన్ని తట్టుకునేలా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తారు.
Details
నాన్-సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు భారీ ప్రోత్సాహం
కేంద్ర ప్రభుత్వం నాన్-సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ విడిభాగాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకం కింద ఈ రంగాన్ని చేర్చింది.
ఇందుకోసం కేంద్రం వచ్చే ఆరు సంవత్సరాల్లో రూ. 22,919 కోట్లు వెచ్చించనుంది. ఈ నిర్ణయం ద్వారా దేశీయంగా భారీ పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉంది.
ఈ పథకం వల్ల సుమారు రూ. 59,350 కోట్ల పెట్టుబడులు రానున్నాయని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు.
దీని ద్వారా ప్రత్యక్షంగా 91,000 మందికి, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Details
ఖరీఫ్ సీజన్ కోసం రూ. 37,216 కోట్ల ఎరువుల సబ్సిడీ
ఖరీఫ్ సీజన్ (ఏప్రిల్ 1 - సెప్టెంబర్ 30)లో వ్యవసాయ ఉత్పత్తికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీని ప్రకటించింది.
పొటాష్, పాస్ఫేట్ ఫెర్టిలైజర్లకు రూ. 37,216 కోట్ల సబ్సిడీ కింద చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గి, పంట ఉత్పత్తిలో స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఎరువుల ధరలను నియంత్రించి, రైతులకు భారం తగ్గించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.