Page Loader
Reservation chart: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. రిజర్వేషన్ చార్ట్‌పై కీలక నిర్ణయం
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. రిజర్వేషన్ చార్ట్‌పై కీలక నిర్ణయం

Reservation chart: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. రిజర్వేషన్ చార్ట్‌పై కీలక నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 30, 2025
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

రైలు ప్రయాణికులకు ఓ శుభవార్త. టికెట్ బుకింగ్‌కు సంబంధించిన అనిశ్చితిని తొలగించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రైలు బయలుదేరే నాలుగు గంటల ముందు ప్రకటించుతున్న రిజర్వేషన్ చార్ట్‌ను ఇకపై ఎనిమిది గంటల ముందే విడుదల చేయనుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ మార్పు తీసుకువచ్చినట్టు అధికారులు తెలిపారు.

Details

రాత్రి 9 గంటలకే సమాచారం అందుబాటులోకి 

మధ్యాహ్నం 2 గంటల లోపు బయలుదేరే రైళ్ల రిజర్వేషన్ చార్ట్‌లను ఒకరోజు ముందే, అంటే రాత్రి 9 గంటల లోపు విడుదల చేయనున్నారు. ఈ విధానం ద్వారా వెయిటింగ్‌ లిస్టులో ఉన్న ప్రయాణికులు తమకు బెర్త్ కేటాయించబడిందా లేదా అనే స్పష్టతను ఎనిమిది గంటల ముందే తెలుసుకోవచ్చు. దీంతో గందరగోళ పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది.

Details

మంత్రి సమీక్షతో మారిన విధానం 

టికెట్ బుకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, ప్రయాణికులకు అనుకూలంగా మార్చే దిశగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం అధికారులను పలు మార్గదర్శకాలు జారీ చేసిన ఆయన, ప్రయాణానికి ఎనిమిది గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ ప్రకటించాలన్న సూచనలతో ఈ కొత్త విధానం తీసుకువచ్చారు. దీనిని దశల వారీగా దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు.

Details

డిసెంబర్ నాటికి టికెటింగ్‌ వ్యవస్థ ఆధునీకరణ 

రైల్వే శాఖ మరో కీలక అడుగు వేసింది. ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ (PRS)ను డిసెంబర్‌ నెలాఖరు నాటికి పూర్తిగా ఆధునీకరించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ వ్యవస్థలో నిమిషానికి సగటుగా 32 వేల టికెట్ల బుకింగ్‌కు అనుమతి ఉన్నా, కొత్త టెక్నాలజీతో అది 1.5 లక్షల టికెట్లు నిమిషానికి బుక్‌ చేయగల సామర్థ్యంతో అభివృద్ధి చేయనున్నారు. అలాగే టికెట్ విచారణ సామర్థ్యం నిమిషానికి నాలుగు లక్షల నుంచి ఏకంగా 40 లక్షల దాకా పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించారు.

Details

తత్కాల్ బుకింగ్‌కు తప్పనిసరి ధ్రువీకరణ 

ఇక తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి కూడా రైల్వే శాఖ కొత్త నిబంధనలతో ముందుకొచ్చింది. జూలై 1 నుంచి IRCTC వెబ్‌సైట్‌, మొబైల్ యాప్‌ ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే తప్పనిసరిగా ధృవీకరించిన యూజర్లు మాత్రమే అనుమతించబడతారు. జూలై నెలాఖరు నాటికి ఈ ధృవీకరణను మరింత కఠినంగా చేస్తూ ఆధార్‌, డిజిలాకర్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులతో అనుసంధానం చేసి, ఓటీపీ ఆధారంగా గుర్తింపు నిర్ధారించాల్సి ఉంటుంది.