
Electricity charges: విద్యుత్ ఛార్జీలు పెంపు లేకుండా నూతన టారిఫ్.. ప్రజలకు ఉపశమనం
ఈ వార్తాకథనం ఏంటి
ఈ వేసవిలో విద్యుత్ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది.
ప్రజలను విద్యుత్ ఛార్జీల భారం నుంచి విముక్తం చేస్తూ, టారిఫ్ పెంపు లేకుండా ప్రకటించింది.
ఇది ఐదేళ్ల తర్వాత తొలిసారి అన్ని వర్గాల వినియోగదారులను పెరిగిన ఛార్జీల భయంతో బాధపడకుండా చేసిన పరిష్కారంగా నిలిచింది.
అంతేకాదు, అదనపు ప్రయోజనాలు కల్పిస్తూ, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది.
విద్యుత్ సంస్థల ఖర్చులు, ఆదాయాల మధ్య వ్యత్యాసమైన రూ.12,632.40 కోట్లు సబ్సిడీ రూపంలో భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
వివరాలు
2025-26 విద్యుత్ టారిఫ్ ప్రకటన
రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఇన్ఛార్జి ఛైర్మన్ ఠాకూర్ రాంసింగ్ గురువారం తిరుపతిలో 2025-26 విద్యుత్ టారిఫ్ను ప్రకటించారు.
గృహ వినియోగదారులకు ఎటువంటి భారం లేకుండా టారిఫ్ను కొనసాగించారు.
కొత్త టారిఫ్లు ఏప్రిల్ 2025 నుంచి అమలులోకి రానున్నాయి. గత ప్రభుత్వం విధించిన తరచూ పెరిగే ఛార్జీలతో ప్రజలు ఆందోళనకు గురవుతుండగా, తాజా నిర్ణయం ఉపశమనాన్ని కలిగించేలా ఉంది.
వివరాలు
2025-26 విద్యుత్ వ్యయ అంచనా
విద్యుత్ కొనుగోలు, నిర్వహణ ఖర్చులు కలిపి రూ.57,544.17 కోట్లు అవసరమని కమిషన్ అంచనా వేసింది.
విద్యుత్ సంస్థలు రూ.58,868.52 కోట్లు అవసరమని తెలిపాయి.
కమిషన్ వాటిపై సమీక్ష జరిపి రూ.1,324.35 కోట్ల తగ్గింపు చేసింది.
విద్యుత్ విక్రయాల ద్వారా రూ.44,323.30 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా.
విద్యుత్ సంస్థల అంచనా ప్రకారం రూ.44,185.27 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
ఆదాయ లోటు రూ.14,683.26 కోట్లుగా డిస్కంలు అంచనా వేయగా, రూ.2,050.86 కోట్ల తగ్గింపు కమిషన్ చేసింది.
వివరాలు
ప్రభుత్వ సబ్సిడీ, రాయితీలు
ప్రభుత్వ సబ్సిడీ మొత్తం రూ.14,746.41 కోట్లు
వ్యవసాయం, ఉద్యానవనం, ధోబీ ఘాట్లు, ఎస్సీ, ఎస్టీ, రజకులు, నాయీ బ్రాహ్మణులు, చేనేత కార్మికులు తదితరులకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం రూ.12,632.40 కోట్లు రాయితీగా అందించనుంది.
కొత్త మార్పులు, ప్రత్యేక సౌకర్యాలు
ఎల్టీ పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులకు టీఓడీ టారిఫ్
విద్యుత్ డిమాండ్ నిర్వహణలో భాగంగా ఎల్టీ పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు టీఓడీ టారిఫ్ ప్రవేశపెట్టనున్నారు.
ఓపెన్ యాక్సెస్ వినియోగదారులకు స్టాండ్బై టారిఫ్
ఇప్పటివరకు గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ వినియోగదారులకు మాత్రమే వర్తించిన స్టాండ్బై టారిఫ్ను ఇప్పుడు అన్ని ఓపెన్ యాక్సెస్ వినియోగదారులకు వర్తింపజేయనున్నారు.
వివరాలు
అదనపు లోడ్పై 50% రాయితీ
గృహ వినియోగదారులు అదనపు లోడ్ను కేవలం 50% ఛార్జీలు చెల్లించి క్రమబద్ధీకరించుకునే ప్రత్యేక పథకం ప్రవేశపెట్టారు.
ఇది మార్చి 1 నుండి జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. వినియోగదారులు ఆన్లైన్ విండో ద్వారా తమ అదనపు లోడ్ను స్వచ్ఛందంగా ప్రకటించుకోవచ్చు.
ఈవీ ఛార్జింగ్ కేంద్రాలకు తక్కువ ఛార్జ్
150 కిలోవాట్ల వరకు కనెక్ట్ చేసిన ఈవీ ఛార్జింగ్ కేంద్రాలకు యూనిట్ను రూ.6.70 మాత్రమే నిర్ణయించారు.
నూతన గృహాలకు ప్రత్యేక టారిఫ్
కొత్తగా ఇళ్లు నిర్మించుకునే లేదా పాత ఇళ్లను పునర్నిర్మించుకునే వినియోగదారులకు ఏప్రిల్ 2025 నుంచి కొత్త గృహ టారిఫ్ వర్తింపు.
వివరాలు
విద్యుత్ డిస్పాచ్ నిర్వహణ మార్పులు
గతంలో నెలవారీ విద్యుత్ కొనుగోళ్లు, వినియోగంపై మాత్రమే కమిషన్ పరిశీలించేది.ఇప్పుడు మార్కెట్ నుండి గంటల వారీగా విద్యుత్ డిస్పాచ్ను సమీక్షించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
బొగ్గు దిగుమతికి సౌలభ్యం
ఏజీ జెన్కో బొగ్గును రైల్-సముద్ర మార్గం-రైల్ ద్వారా రవాణా చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీని ద్వారా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతర బొగ్గు సరఫరా అయ్యే వీలుంది.
2025-26 విద్యుత్ టారిఫ్తో పాటు,2023-24 పనితీరు నివేదిక కూడా విడుదల తొలిసారిగా విద్యుత్ సంస్థల పనితీరు నివేదికను టారిఫ్ కమిషన్ ఆర్డర్లో చేర్చారు.
ఈ సారి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం లేకుండా టారిఫ్ను ప్రకటించడం, వ్యవసాయ,సామాజిక వర్గాలకు భారీ సబ్సిడీలు అందించడం,కొత్త వినియోగదారులకు ప్రోత్సాహకాలు అందించడం ప్రజలకు ఊరట కలిగించే పరిణామం.