
Hyderabad-Vijayawada: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. ఒక్కో కిలోమీటరుకు రూ.20 కోట్లు!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వేగంగా ముందుకు సాగుతోంది.
ఈ దిశగా మే నెలాఖరులోగా డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) తయారుచేయాలని యోచనలో ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్-65ను ఆరు లేన్లుగా విస్తరించాలని నిర్ణయించింది.
ఈ ప్రాజెక్ట్ కోసం కిలోమీటరుకు సుమారు రూ.20 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 265 కిలోమీటర్ల విస్తరణ పనుల కోసం రూ.5,300 కోట్ల ఖర్చు అవుతుందని భావిస్తున్నారు.
దండు మల్కాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని గొల్లపూడి వరకు ఈ విస్తరణ జరగనుంది. జూన్ మొదటి వారంలో ఈ పనుల కోసం అవసరమైన అనుమతులను పొందాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Details
ట్రాఫిక్ కు శాశ్విత పరిష్కారం
డీపీఆర్ తయారీ బాధ్యత భోపాల్కు చెందిన సంస్థకు అప్పగించగా, ప్రస్తుతం ఆ సంస్థ అధికారులు, ఎన్హెచ్ఏఐ ప్రతినిధులు కలిసి సమీక్షలు నిర్వహిస్తున్నారు.
విస్తరణ కోసం ఇప్పటికే అవసరమైన భూముల్ని సేకరించారు. టెక్నికల్ అంశాల పరిశీలనతో పాటు, రోడ్డుపై వెహికల్ అండర్పాస్లు (VUP), రోడ్ ఓవర్ బ్రిడ్జిలు (ROB), ఇతర బ్రిడ్జిల నిర్మాణాన్ని ప్రణాళికలో చేర్చారు.
రామాపురం క్రాస్ రోడ్డులో వీయూపీ నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే హైదరాబాద్-విజయవాడ మధ్య ట్రాఫిక్ ఒత్తిడికి శాశ్వత పరిష్కారం లభించనుంది.