
Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీమంత్రి హరీష్ రావు
ఈ వార్తాకథనం ఏంటి
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణను జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ మళ్లీ ప్రారంభించింది.
ఈ విచారణలో భాగంగా, సోమవారం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యే అవకాశం ఉంది.
గతంలో కేసీఆర్ మంత్రివర్గంలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.
ఆయన ఇప్పటికే కమిషన్ ముందు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
మేడిగడ్డ వద్ద రెండు పిలర్లు కుంగిపోయిన విషయాన్ని ఆయన ఆ సమయంలో వివరించారు.
అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 35 శాతం భూభాగానికి సాగునీరు అందించవచ్చని అభిప్రాయపడ్డారు.
వివరాలు
రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ
కాగా, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్.. ప్రస్తుతం బీజేపీ ఎంపీ.. ఇప్పటికే కమిషన్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
ఇప్పుడు హరీష్ రావు విచారణలో ఏమి వెల్లడిస్తారో అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చులు, నిబంధనల అమలుపై కమిషన్ లోతుగా దర్యాప్తు జరిపే ప్రయత్నంలో ఉంది.
ఈ క్రమంలో విచారణ కోసం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ సమగ్ర ప్రశ్నావళిని సిద్ధం చేశారు.
వివరాలు
కాగ్ నివేదికల ఆధారంగా లోతైన పరిశీలన
కమిషన్ ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం విషయంలో ఉత్పన్నమైన లోపాలు, డిజైన్ సమస్యలు, నాణ్యత ప్రమాణాల లంఘనలు, ఆర్థిక అక్రమాలపై విచారణను ప్రారంభించింది.
ఈ విషయాల్లో నిజానిజాలను తెలుసుకునేందుకు, కమిషన్ నీటిపారుదల శాఖ ప్రస్తుత ఇంజినీర్లతో పాటు, రిటైర్డ్ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి అఫిడవిట్లు స్వీకరించింది.
అందులోని వివరాల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ వారి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించారు.
అంతేకాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలతో పాటు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డిఎస్ఎ) నివేదికలను కూడా విచారణలో కీలక ఆధారాలుగా కమిషన్ పరిగణలోకి తీసుకుంది.
కాళేశ్వరం నిర్మాణ సమయంలో కాంట్రాక్ట్ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా అధిక బిల్లులు చెల్లించబడినట్లు కమిషన్ గుర్తించింది.
వివరాలు
కమిషన్ విచారణకు కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జూన్ 11న కమిషన్ విచారణకు స్వయంగా హాజరుకానున్నారు.
కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు ఆయన స్వయంగా ఆసక్తి చూపారు.
రాజకీయ నాయకులపై జరుగుతున్న ఈ విచారణలు పూర్తయ్యాక, కమిషన్ తుది నివేదికను జూన్ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.