Page Loader
Delhi: ఢిల్లీలో మరోసారి భారీ వర్షం, దుమ్ము తుఫాను.. విమానాల రాకపోకలకు అంతరాయం
ఢిల్లీలో మరోసారి భారీ వర్షం, దుమ్ము తుఫాను.. విమానాల రాకపోకలకు అంతరాయం

Delhi: ఢిల్లీలో మరోసారి భారీ వర్షం, దుమ్ము తుఫాను.. విమానాల రాకపోకలకు అంతరాయం

వ్రాసిన వారు Sirish Praharaju
May 02, 2025
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో మరోసారి భారీ వర్షం,దుమ్ముతో కూడిన గాలి బీభత్సం సృష్టించింది. ఈ వాతావరణ మార్పుల కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురుగాలులు తీవ్రమైన స్థాయిలో ఉండటంతో విమాన రాకపోకల్లో పెద్దగా అంతరాయాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయంలో విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వేగంగా అనుసంధానించాల్సిన విమానాలను అందుకోవాల్సిన ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడంలో కష్టాలు పడుతున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో వారు అక్కడే నిలిచిపోయారు. అయితే ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సిబ్బంది సేవలు అందిస్తున్నారని విమానాశ్రయ అధికారులు హామీ ఇచ్చారు. ప్రయాణానికి ముందు ప్రయాణికులు తమ తమ విమాన సంస్థల అధికారిక వెబ్‌సైట్లను పరిశీలించాలని సూచించారు.

వివరాలు 

విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం 

విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, ప్రయాణికులు తమ షెడ్యూల్ తెలుసుకోవడానికి సంస్థల వెబ్‌సైట్లు చూడాలని ఎయిర్ ఇండియా విజ్ఞప్తి చేసింది. అంతరాయాలను తగ్గించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. కొన్ని విమానాలు ఆలస్యంగా రావడం జరుగుతుండగా,మరికొన్ని విమానాలను మార్గం మళ్లించినట్టు వెల్లడించింది. ప్రయాణానికి ముందు తమ ప్రయాణ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించింది. ఇక నగరంలోని ద్వారక,ఖాన్‌పూర్,సౌత్ ఎక్స్‌టెన్షన్ రింగ్ రోడ్,మింటో రోడ్,లజ్‌పత్ నగర్,మోతీబాగ్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నీరు నిలిచిపోయింది. గాలులు తాళలేని చెట్లు కూలిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు రహదారులపై పడినట్లుగా సమాచారం. అయినప్పటికీ అధికారులు నష్టాన్ని అంచనా వేయలేదు. అత్యవసరమైన పనుల కోసమే బయటకి రావాలని, సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.

వివరాలు 

ఈ  ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు 

ప్రస్తుతం ఢిల్లీలో ఉష్ణోగ్రత 19.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. నగరమంతటా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. శనివారం వరకు ఢిల్లీలో ఈ వాతావరణం కొనసాగుతుందని అంచనా వేసింది. సాధారణంగా మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి కానీ ప్రస్తుతం వర్షాలు మరియు ఉరుములతో కూడిన వాతావరణం కనిపిస్తోందని తెలిపింది.