
Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్లో హై అలర్ట్.. భద్రతా మాక్డ్రిల్తో అప్రమత్తత!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థను మరింత కఠినతరం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్లో గురువారం రాత్రి ప్రత్యేక మాక్డ్రిల్ నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉండేందుకు ఈ డ్రిల్ చేపట్టారు.
జీఆర్పీ ఇన్స్పెక్టర్ జేవీ రమణ, ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కోట జోజి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్లులో రైల్వే పోలీసులు, డాగ్ స్క్వాడ్లతో కూడిన ఐదు ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి.
ఈ బృందాలు స్టేషన్లోని అన్ని ప్లాట్ఫాంలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జులు, విశ్రాంతి గదులు, టికెట్ కౌంటర్లు, బుకింగ్ కార్యాలయాలు, పార్శిల్ విభాగాన్ని పూర్తిగా శోధించాయి.
Details
అనుమానాస్పద వ్యక్తుల వివరాల సేకరణ
అలాగే స్టేషన్ వెలుపల జనసాంద్రత ఎక్కువగా ఉండే పూల మార్కెట్, డీజిల్ లోకో షెడ్ వంటి ప్రదేశాల్లోనూ తనిఖీలు చేపట్టారు.
ప్రయాణికుల బ్యాగులు పరిశీలించడంతో పాటు అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల వివరాలను కూడా నమోదు చేశారు.
రైల్వే స్టేషన్లో ఉన్న అన్ని సీసీ కెమెరాల పనితీరును సమీక్షించిన అధికారులు, నిరంతర నిఘా కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
కెమెరాల ఫుటేజీని సమయానుసారంగా, జాగ్రత్తగా పరిశీలించాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఈ మాక్డ్రిల్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది స్పందనపై అవగాహన కల్పించడంతో పాటు ప్రయాణికుల్లో భద్రతపై నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేశారు.