
Hindi row: త్రిభాషా విధానంపై ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
1 నుండి 5వ తరగతి వరకు హిందీ భాషను తప్పనిసరిగా అభ్యాస పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తం కావడంతో, మహారాష్ట్ర ప్రభుత్వం త్రిభాషా విధానంపై ఇప్పటివరకు జారీ చేసిన రెండు ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది. భవిష్యత్తులో భాషా విధానంపై స్పష్టతకు తోడ్పడేలా విద్యావేత్త నరేంద్ర జాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో,త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా జులై 5న చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని మహారాష్ట్ర నవనిర్మాణ సేన, శివసేన (యూబీటీ) పార్టీలు రద్దు చేశాయి. అయితే, మరాఠీ ప్రజల ఐక్యత కోసం అదే రోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.
వివరాలు
రఘునాథ్ మషేల్కర్ నేతృత్వంలోని కమిటీ
రాష్ట్ర ప్రభుత్వం మరాఠీ ప్రజల మధ్య చీలిక తీసుకురావడానికి ప్రయత్నించిందని ఆరోపిస్తూ, ప్రజల ఐకమత్యాన్ని చూసిన తర్వాతే ప్రభుత్వం ఆ రెండు ఉత్తర్వులను వెనక్కు తీసుకుందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే త్రిభాషా విధానాన్ని 1 నుండి 12వ తరగతుల వరకు విస్తరించాలని రఘునాథ్ మషేల్కర్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సులను అంగీకరించారని, అందుకే ఆయన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారని ఫడణవీస్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ, తాను కేవలం మషేల్కర్ కమిటీ సూచనలపై అధ్యయనం చేయించేందుకు మాత్రమే ఒక బృందాన్ని ఏర్పాటు చేశానని, కానీ ఆ బృందం ఒక్కసారి కూడా సమావేశం కాలేదని స్పష్టం చేశారు.
వివరాలు
హిందీని ఐచ్ఛిక భాషగా మారుస్తూ ఉత్తర్వులు
ఇంగ్లిష్, మరాఠీ మీడియం పాఠశాలల్లో చదువుతున్న 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు హిందీ భాషను తప్పనిసరి మూడో భాషగా చేయాలంటూ ఫడణవీస్ ప్రభుత్వం ఏప్రిల్ 16న మొదటి ఉత్తర్వులు జారీ చేసింది. కానీ విమర్శలు వెల్లువెత్తడంతో, తరువాత జూన్ 17న ఈ విధానాన్ని సవరించి హిందీని ఐచ్ఛిక భాషగా మారుస్తూ మరోసారి ప్రభుత్వం కొత్త ఉత్తర్వులను విడుదల చేసింది.