Page Loader
గుజరాత్‌,రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌లను ముంచెత్తిన భారీ వర్షాలు.. 3 రాష్ట్రాలకు పొంచిఉన్న వరద ముప్పు
నీట మునిగిన రాజస్థాన్ లోని సాంచోర్ పట్టణం

గుజరాత్‌,రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌లను ముంచెత్తిన భారీ వర్షాలు.. 3 రాష్ట్రాలకు పొంచిఉన్న వరద ముప్పు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 19, 2023
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్ ను ముప్పతిప్పలు పెట్టిన అతి తీవ్ర తుపాను బిపోర్‌జాయ్‌, క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం తీరం దాటింది. దీంతో గుజరాత్‌ సహా పరిసర రాష్ట్రాలు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించి భారీ వరదలను మిగిల్చింది. ఈ క్రమంలో దాదాపు లక్ష మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని గుజరాత్ అధికారులు వెల్లడించారు. ఎక్కడా ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా అందరినీ సేఫ్ గా రక్షించి పునరావాసం కల్పించామని తెలిపారు. మరో 12 గంటల పాటు వాయుగుండం తీవ్రత కొనసాగనున్నట్లు వివరించారు.

DETAILS

కేంద్రం సహా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ఎదుర్కొన్నాం : అధికారులు

బిపోర్‌జాయ్‌ తుపాను ప్రభావిత గుజరాత్‌లోని బనస్కాంత, పఠాన్‌ జిల్లాల్లో ఇప్పటికే భారీగా వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం నాటికే అమీర్‌గఢ్‌ ప్రాంతంలో 206 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు పేర్కొన్నారు. దంతా, ధనేరా ప్రాంతాల్లో 168 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. అయితే గుజరాత్ లోని కచ్‌లో మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గుజరాత్‌లోని 9 జిల్లాలను తుపాను భీకరంగా వణికించింది. అయినప్పటికీ ఎక్కడా ప్రాణనష్టం లేకుండా అందరినీ కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. కేంద్రం సహా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే తుపానును సమర్థంగా ఎదుర్కొగలిగినట్లు స్పష్టం చేశారు.

DETAILS

రానున్న 24 గంటల్లో వానలే వానలు : ఐఎండీ

మరోవైపు పునరావాసం కేంద్రాల్లోనే సుమారు 707 మంది పిల్లలు పుట్టారన్న అధికారులు, దాదాపు 2 లక్షల పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఈశాన్య రాజస్థాన్‌, పశ్చిమ మధ్యప్రదేశ్‌ల్లో తుపాను ప్రభావంతో ఆదివారం భారీగా వర్షాలు కురిశాయి. సోమవారం సైతం వానలు కురవనున్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ రాజస్థాన్‌, ఉత్తర గుజరాత్‌లలో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న కారణంగా రాజస్థాన్‌లోని 3 జిల్లాల్లో భారీగా వర్షాలు పడ్డాయి. జలోర్‌, సిరోహి, బార్మెర్‌ జిల్లాల్లోనైతే వరద పోటెత్తడం గమనార్హం. సిరోహిలోని బటీసా డ్యాంలో నీటిమట్టం అమాంతం 315 మీటర్లకు పెరిగింది. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.