PM MODI HYDERABAD : ఇవాళ హైదరాబాద్కు ప్రధాని మోదీ.. ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ బహిరంగ సభ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీ స్టేడియంలో జరగనున్న బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆంక్షలు కట్టుదిట్టం : ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు ట్రాఫిక్కు అనుమతి ఉండదు. వాహనాలను నాంపల్లి, రవీంద్రభారతి వైపు మళ్లించనున్నారు. అబిడ్స్, గన్ఫౌండ్రి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు ట్రాఫిక్కు అనుమతి లేదు. ఆయా వాహనాలను ఎస్బీఐ గన్ఫౌండ్రి నుంచి చాపల్ రోడ్డులోకి మళ్లించనున్నారు.
మీడియా వాహనాలు మహబూబ్ కాలేజీలో పార్కింగ్ చేయాలి : ట్రాఫిక్ పోలీసులు
ట్యాంక్బండ్ నుంచి బషీర్బాగ్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను లిబర్టీ వద్ద హిమాయత్నగర్ వైపు మళ్లిస్తారు. ముషీరాబాద్, హిమాయత్నగర్ వైపు నుంచి వచ్చే వెహికిల్స్ సహా ఎల్బీనగర్ నుంచి వచ్చే వాహనాలు నిజాం కాలేజీ గ్రౌండ్లో పార్కు చేయాలి. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఇన్కమ్ ట్యాక్స్ భవన్ వద్ద ఆగి, ఎన్టీఆర్ స్టేడియంలో పార్కు చేసుకోవాలి. మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు పబ్లిక్ గార్డెన్ వద్ద ఆగి, గార్డెన్ లోపలికి వెళ్లి పార్కు చేసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీఐపీ వాహనాలు టెన్నీస్ కోర్టులో పార్కు చేసుకోవాల్సి ఉంది. మరోవైపు మీడియా వాహనాలు నిజాం కాలేజీ ఫస్ట్ గేట్ వద్ద ఆగి, మహబూబ్ కాలేజీలో పార్కు చేసుకోవాలని ఆదేశాలిచ్చారు.