మాయవతి,కేసీఆర్ కలిసి మూడో కూటమి పెట్టాలి, కానీ కేసీఆరే నాయకత్వం వహించాలి:అసదద్దీన్
ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదద్దీన్ ఓవైసీ కాంగ్రెస్, బీజేపీలపై ప్రశ్నల వర్షం గుప్పించారు. అదే సమయంలో కేసీఆర్ పై ప్రశంసించారు. మోదీ సర్కార్ని దించేందుకు థర్డ్ ఫ్రంట్కు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఇందుకు మాయవతి, కేసీఆర్ లాంటి వారు చొరవ చూపించాలన్నారు. కూటమికి కేసీఆర్ నాయకత్వం వహిస్తే బాగుంటుందన్నారు. మాయావతి, కేసీఆర్ ఇటు ఇండియా కూటమి అటు ఎన్డీఏ కూటముల్లోనూ లేరని అసద్ గుర్తు చేశారు. ప్రస్తుతం తృతీయ కూటమికి అవకాశముందని వివరించారు. ఇదే జరిగితే రాజకీయాల్లో ఎలాంటి మార్పులొస్తాయో మీకే తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ వర్గింగ్ కమిటీ సమావేశాలను అసద్ విమర్శించారు. ఎస్సీలు, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటున్న కాంగ్రెస్, ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడకపోవడంపై ఆయన నిలదీశారు. మైనార్టీలకు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు.
బీజేపీ హయాంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో శాంతి భద్రతలు క్షీణించాయని అసద్ మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ సైతం దెబ్బతిందని విమర్శించారు. తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితులు లేవని, ముస్లిం యువతులు ధైర్యంగా హిజాబ్ ధరించి పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తున్నట్లు వివరించారు. మరోవైపు ముస్లింలపైనా దాడులేం లేవన్నారు. ఆర్థిక వ్యవస్థ సైతం బాగుందని, కాంగ్రెస్ పాచికలు తెలంగాణలో పారవని అభిప్రాయపడ్డారు. కశ్మీర్లో జవాన్లు చనిపోతున్నా, కేంద్రం మాట్లాడకపోవడాన్ని అసద్ ఖండించారు. ఇదే సమయంలో అక్కడ వేరే సర్కార్ ఉంటే, బీజేపీ రచ్చరచ్చ చేసి ఉండేదన్నారు. మరి ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉంటోందో చెప్పాలని పట్టుబట్టారు.