Page Loader
India-Pakistan: ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలం మూసివేత..? 
ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలం మూసివేత..?

India-Pakistan: ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలం మూసివేత..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2025
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) ఘటన తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. భారత్‌ కొన్ని ఆంక్షలు విధించిందన్న ఆగ్రహంతో పాకిస్థాన్‌ తీవ్రంగా స్పందించింది. భారత్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పాకిస్థాన్‌ పలు చర్యలకు పాల్పడుతోంది. అందులో భాగంగా భారతీయ విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో, భారత్‌ కూడా దీనిపై ప్రతిస్పందన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోందని సమాచారం. పాకిస్థాన్‌ విమానయాన సంస్థలు భారత గగనతలాన్ని (Indian Airspace) వినియోగించకుండా నిషేధించే అంశాన్ని భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. పలు ఆంగ్ల వార్తా సంస్థలు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ విషయం వెల్లడించాయి.

వివరాలు 

పాకిస్థాన్‌ విమానాలు చైనా లేదా శ్రీలంక గగనతలాల ద్వారా మళ్లించాలి 

భారత కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ''ప్రస్తుతం ఇది కేవలం ప్రతిపాదన దశలో ఉంది. ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు'' అని పేర్కొన్నారు. అయితే,భారత ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే,అది పాకిస్థాన్‌ విమానయాన రంగంపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశముంది. పాకిస్థాన్‌కు చెందిన విమానాలు.. మలేసియాలోని కౌలాలంపూర్‌, ఇతర నగరాలు, అలాగే సింగపూర్‌, థాయ్‌లాండ్‌ వంటి దక్షిణాసియా దేశాలకు వెళ్లాలంటే - భారత గగనతలాన్ని దాటాల్సిన అవసరం ఉంది. భారత్‌ తమ గగనతలాన్ని మూసివేస్తే, పాకిస్థాన్‌ విమానాలు చైనా లేదా శ్రీలంక గగనతలాల ద్వారా మళ్లించాల్సి వస్తుంది. దీని వలన ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉన్నదీ కాక, నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతాయి.

వివరాలు 

భారత్‌ కంటే పాకిస్థాన్‌కే ఎక్కువ ఆర్థిక నష్టం 

ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌ విమానయాన రంగానికి ఇది మరింత భారం అవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల భారత్‌కు చెందిన విమానాలపై పాకిస్థాన్‌ తమ గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. దాంతో భారత విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వచ్చింది. అయితే, పాక్‌ తీసుకున్న నిర్ణయం కారణంగా భారత్‌ కంటే పాకిస్థాన్‌కే ఎక్కువ ఆర్థిక నష్టం వాటిల్లిందని నిపుణుల అభిప్రాయం. ఇప్పటివరకు భారతదేశం నుంచి పాకిస్థాన్‌ గగనతలం మీదుగా వారానికి సుమారు 800 అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగించేవి. ఈ విమానాల గగనతల వినియోగానికి పాకిస్థాన్‌ ఓవర్‌ఫ్లైట్‌ ఫీజు రూపంలో రోజుకు సుమారు 1,20,000 అమెరికన్ డాలర్లు వసూలు చేసేది.

వివరాలు 

 పాకిస్థాన్‌కు 100 మిలియన్‌ డాలర్లకు పైగా నష్టం 

ఇప్పుడు భారత్‌ గగనతలాన్ని మూసేస్తే, ఆ మొత్తం ఆదాయం పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌ దాదాపు ఐదు నెలల పాటు తమ గగనతలాన్ని భారత విమానాల రాకపోకలకు నిలిపివేసింది. అప్పట్లో పాకిస్థాన్‌కు 100 మిలియన్‌ డాలర్లకు పైగా నష్టం వచ్చినట్లు సమాచారం.