
Arabian Sea: దాడులను ఎదుర్కొనేందుకు అరేబియా సముద్రంలో 3 యుద్ధనౌకలను మోహరించిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
అరేబియా సముద్రంలో భారత వాణిజ్య నౌకలపై దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.
అరేబియా సముద్రంలో దాడుల నుంచి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఇందుకోసం సముద్రంలో సుదూర నిఘా కోసం నిఘా విమానం P-8Iతో పాటు INS మోర్ముగో, INS కొచ్చి, INS కోల్కతాను నావికాదళం మోహరించింది.
గుజరాత్ తీరంలో ఎంవీ కెమ్ ప్లూటో (MV Chem Pluto) అనే వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగిన రెండు రోజుల తర్వాత నౌకాదళం ఈ నిర్ణయం తీసుకుంది.
గుజరాత్లోని పోర్బందర్ తీరానికి సమీపంలో ఉన్న ఎంవీ కెమ్ ప్లూటో నౌకపై అకస్మాత్తుగా డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
నావికాదళం
MV కెమ్ ప్లూటో నౌకపై ఫోరెన్సిక్, టెక్నికల్ విచారణ
డ్రోన్ దాడికి గురైన వ్యాపార నౌక MV కెమ్ ప్లూటోను నేవీ బృందం ముంబై పోర్టుకు చేరుకున్న తర్వాత తనిఖీ చేసింది.
ఈ నౌకపై భారత్లోని పశ్చిమ తీరానికి సమీపంలో డ్రోన్ దాడి చేసిందని, అయితే దాడి ఎక్కడి నుంచి వచ్చిందనేది ఫోరెన్సిక్, టెక్నికల్ విచారణ తర్వాతే తెలుస్తుందని అధికారులు తెలిపారు.
MV కెమ్ ప్లూటో నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేసిందని అమెరికా చెప్పిన విషయం తెలిసిందే.
అయితే అమెరికా వాదనలను ఇరాన్ తిరస్కరించింది. అమెరికా ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు.
ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఆగకపోతే ఇతర జలమార్గాలను బలవంతంగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.