మణిపూర్లో మహిళలు మా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు: సైన్యం
మణిపూర్లోని మహిళలు ఉద్దేశపూర్వకంగా తమ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని, తమ ఆపరేషన్లలో జోక్యం చేసుకుంటున్నారని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు 2నిమిషాల 12 సెకన్ల నిడివి గల వీడియోను ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. మణిపూర్లో హింసాత్మక ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సైన్యం అధికారికంగా చేసిన ఈ ప్రకటన రాష్ట్రంలో దుస్థితికి అద్దం పడుతుంది. ఇంఫాల్ ఈస్ట్లో 1,500మహిళల గుంపు మైతీ వేర్పాటువాద సమూహానికి చెందిన 12 మంది నిరసనకారులను భద్రతా దళాలను నుంచి విడిపించిన రెండు రోజుల తర్వాత ఆర్మీ ఈ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా మణిపూర్ మహిళలపై ఆ వీడియోలో పలు ఆరోపణలు చేసింది. హింసకు పాల్పడుతున్న వారు పారిపోవడానికి మహిళా కార్యకర్తలు సహాయం చేస్తున్నారని పేర్కొంది.
మానవత్వంతో ఉండటం మా బలహీనత కాదు: ఆర్మీ
మానవత్వంతో ఉండటం తమ బలహీనత కాదని ఆర్మీ అధికారులు వీడియోలో పేర్కొన్నారు. మహిళలు రాత్రి, పగలు తమ కార్యకలాపాలలో జోక్యం చేసుకుంటున్నారని చెప్పారు. అస్సాం రైఫిల్స్ సైనికులు క్యాంప్లోకి వెళ్లడాన్ని ఆలస్యం చేసేందుకు రోడ్డుపై కందకాలు తవ్వుతున్నారని సైన్యం ఆరోపించింది. తమకు అవసరమైన నిత్యావసర వస్తువులను కూడా అడ్డుకుంటున్నరని భారత సైన్యం స్పియర్ కార్ప్స్ ట్వీట్ చేసింది. ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకు క్లిష్ట పరిస్థితుల్లో భద్రతా బలగాలు సమయానుకూలంగా స్పందించేందుకు ఇలాంటి ఘటనలు అడ్డంకిగా మారాయని చెప్పింది. సైన్యాన్ని నిరోధించడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకోవడాన్ని ఆర్మీ తప్పుబట్టింది. మే 3నుంచి మైతీ, కుకీ వర్గాల మధ్య జరిగిన జాతి ఘర్షణల్లో 115మంది మరణించారు.