Page Loader
Indian Navy: అరేబియా సముద్రంలో అలజడి.. విజయవంతమైన భారత్‌ నౌకాదళం అత్యాధునిక మిసైల్‌ టెస్ట్‌ 
Indian Navy: విజయవంతమైన భారత్‌ నౌకాదళం అత్యాధునిక మిసైల్‌ టెస్ట్‌

Indian Navy: అరేబియా సముద్రంలో అలజడి.. విజయవంతమైన భారత్‌ నౌకాదళం అత్యాధునిక మిసైల్‌ టెస్ట్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 24, 2025
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం భారత్‌-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుతున్న వేళ,దేశ రక్షణ రంగంలో ఓ కీలక ముందడుగు పడింది. భారత నౌకాదళం పూర్తిగా అప్రమత్తతతో సిద్ధంగా ఉన్న తరుణంలో, 'గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్' ఐఎన్‌ఎస్‌ సూరత్‌ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. తొలిసారిగా గగనతలంలో వస్తున్న ఓ లక్ష్యాన్ని అత్యంత కచ్చితంగా ఛేదించడంలో ఇది విజయవంతమైంది. ఈ ఘట్టానికి సంబంధించిన వీడియోను నౌకాదళం అధికారికంగా విడుదల చేసింది. సముద్రంపై తక్కువ ఎత్తులో సాగుతూ రాడార్‌లను తప్పించుకునే లక్ష్యాన్ని, అత్యుత్తమ సమన్వయంతో నిర్వీర్యం చేయగలిగినట్లు వెల్లడించారు.

వివరాలు 

పాక్‌ క్షిపణి పరీక్షల ప్రకటనతో ఉత్కంఠ 

సీ స్కిమ్మింగ్ టార్గెట్లు అంటే సముద్ర మట్టానికి సమీపంగా, రాడార్లను మోసగించేందుకు నీటిపై ప్రయాణించే డ్రోన్లు, క్షిపణులు వంటివే. ఐఎన్‌ఎస్‌ సూరత్‌ అనేక రకాల మిలటరీ ప్లాట్‌ఫామ్‌లతో కలిసి పని చేస్తూ, లక్ష్యాన్ని ఖచ్చితంగా గుర్తించి ధ్వంసం చేసింది. దీనిలో భాగంగా మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ (MR-SAM) వినియోగించారు, ఇది లక్ష్యాన్ని సమర్థవంతంగా ఛేదించడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్‌ మిలటరీ ఒక నోటమ్‌(నోటీసు టు ఎయిర్‌మెన్‌ - NOTAM)విడుదల చేసి,తాము ఉపరితల ప్రయోగ క్షిపణి పరీక్షలు చేపట్టబోతున్నట్లు ప్రకటించింది.

వివరాలు 

కర్వార్‌లో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ తళుకుల దండయాత్ర 

ఈపరీక్షలు ఏప్రిల్‌ 24,25 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇదేసమయంలో ఐఎన్‌ఎస్‌ సూరత్‌ నిర్వహించిన సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌ ఛేదన పరీక్ష విజయవంతమవడం విశేషం. సర్ఫేస్‌ టు సర్ఫేస్‌ క్షిపణులపై MR-SAMలు సమర్థంగా పనిచేసే సామర్థ్యాన్ని ఇందులో నౌకాదళం నిరూపించింది. భారత వాయుసేన శక్తిని ప్రతిబింబించే మరో ప్రధాన ఆధారంగా,విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. ఈవిషయాన్ని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ధ్రువీకరించారు.ప్రస్తుతం ఇది కర్ణాటక రాష్ట్రంలోని కర్వార్‌ పోర్ట్‌ సమీపంలో గస్తీ కాస్తోంది. అధికారికంగా చెబుతున్నాఇది అనుకున్న ప్రణాళిక ప్రకారమే మోహరించబడిందని,కానీ పహల్గాం దాడి జరిగిన సమయంలో ఈ సమాచారం వెలుగులోకి రావడం గమనార్హం. అంతేగాక,ఇప్పటికే భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక సంబంధాలను భారత్‌ మరింతగా తగ్గించిన నేపథ్యం కూడా ఉంది.