
Railways Fare Hike: జూలై 1, 2025 నుండి రైలు టికెట్ ధరల్లో భారీ మార్పులు.. పెంపు ఎలా ఉండనుంది?
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ రైల్వేలు జూలై 1వ తేదీ నుంచి కొన్ని రైళ్లపై ప్రయాణ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. కొత్త టికెట్ ధరలు,బుకింగ్ విధానం జులై 1 అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఇకపై తత్కాల్ టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణికుల కోసం ఆధార్ అనేది తప్పనిసరి అవుతుందని వెల్లడించారు. ఈ నూతన నిబంధన అమలుకు సంబంధించి అన్ని రైల్వే జోన్ల మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. నాన్-ఏసీ మెయిల్,ఎక్స్ప్రెస్ రైళ్ల టికెట్ ఛార్జీలు కిలోమీటరుకు 1 పైసా చొప్పున పెంచుతున్నట్లు సమాచారం. అదే విధంగా,ఏసీ తరగతిలో ప్రయాణించే వారికి కిలోమీటరుకు 2 పైసల పెంపు ఉంటుంది. అయితే ఈధరల పెంపు సబర్బన్(పట్టణ పరిసర)రైళ్ల టికెట్లపై ప్రభావం చూపదని స్పష్టం చేశారు.
వివరాలు
టికెట్ ధరలో అదనంగా పెంపు..
సెకండ్ క్లాస్ ఆర్డినరీ కోచ్లో ప్రయాణించే వారు 500 కిలోమీటర్ల దూరం దాటి ప్రయాణిస్తే, టికెట్ ధరలో అదనంగా పెంపు ఉంటుంది. 501 నుండి 1500 కి.మీ.ల మధ్య ప్రయాణిస్తే రూ.5, 1501 నుండి 2500 కి.మీ.ల దాకా రూ.10, 2501 నుండి 3000 కి.మీ.ల మధ్య అయితే రూ.15 వరకు ధరలు పెరుగుతాయి. నాన్-ఏసీ రైళ్లలోని స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ వంటి నాన్-సబర్బన్ కోచ్లకు కూడా కిలోమీటరుకు అర పైసా చొప్పున ధరలు పెంపు జరుగుతుంది. అదేవిధంగా, ఏసీ తరగతులన్నిటికీ అన్ని రకాల రైళ్లలో కిలోమీటరుకు 2 పైసల చొప్పున ఛార్జీలను పెంచినట్టు రైల్వే శాఖ ప్రకటించింది.
వివరాలు
బుక్ చేసిన టికెట్లపై ఈ కొత్త ఛార్జీలు వర్తించవు
అయితే రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్ ఫాస్ట్ సర్ఛార్జీలలో ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించారు. ఇంతకుముందు బుక్ చేసిన టికెట్లపై ఈ కొత్త ఛార్జీలు వర్తించవని తెలిపారు. తత్కాల్ బుకింగ్ విషయంలో కీలక మార్పుగా, ఆధార్ కార్డు ఆధారంగా ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉండే విధంగా వ్యవస్థను రూపొందించినట్టు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ చర్య సాధారణ ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగించడమే లక్ష్యంగా తీసుకురాబడిందని వివరించారు.