
TG Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారులకు నిధులు జమ చేసేలా ప్రభుత్వం కసరత్తు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు నిధులను జమ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తోంది. మొదటి విడతలో ఎంపికైన లబ్ధిదారులు తమ పనులను ప్రారంభించి పునాది వరకు పూర్తిచేస్తే, వారి ఖాతాలో రూ. 1 లక్ష జమ కానుంది. ఇందుకోసం ప్రభుత్వం ముందుగానే అవసరమైన నిధులను సిద్ధం చేసింది. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. జనవరి 21న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి, ప్రతి మండల పరిధిలోని ఒక గ్రామంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొదటి విడతలో 562 పంచాయతీలకు చెందిన 71,482 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. వీరందరికీ ప్రోసిడింగ్ కాపీలు పంపిణీ చేశారు.
వివరాలు
నిధుల విడుదల విధానం
ప్రోసిడింగ్ కాపీలు అందుకున్న లబ్ధిదారులు తమ నిర్మాణ పనులు ప్రారంభించారు. పునాది దశ పూర్తయిన వెంటనే, తొలి విడత కింద వారి ఖాతాల్లో రూ. లక్ష జమ అవుతుంది. మొత్తం నాలుగు విడతల్లో రూ. 5 లక్షలు లబ్ధిదారులకు అందజేస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) నిధుల భాగస్వామ్యం కూడా ఉంటుంది. అయితే, మొదటి విడత కింద ఇచ్చే రూ. లక్షను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది.
వివరాలు
పనుల పరిశీలన & నిధుల కేటాయింపు
పునాది నిర్మాణం పూర్తయిన వెంటనే, అధికారులు స్థలాన్ని పరిశీలిస్తారు. పనుల ఫొటోలు తీసి అప్లోడ్ చేసి, లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. నిధుల విడుదలలో జాప్యం లేకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూ. 1,000 కోట్లు కేటాయించింది.
వివరాలు
దరఖాస్తుల పరిశీలన & కేటగిరీల విభజన
ప్రభుత్వం అందిన దరఖాస్తులను మూడు విభాగాలుగా వర్గీకరించింది: L1 - సొంత స్థలం ఉన్న కానీ ఇల్లు లేనివారు. L2 - స్థలం, ఇల్లు రెండూ లేనివారు. L3 - అద్దె ఇళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లలో నివసిస్తున్నవారు. ప్రభుత్వం మొదటి దశలో L1 కేటగిరీకి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. రెండో దశలో స్థలం కూడా లేని వారికి ఇల్లు నిర్మాణ సహాయం అందించనుంది. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.