Telangana: సంక్రాంతికి 'సెలబ్రేట్ ది స్కై'.. తెలంగాణలో అంతర్జాతీయ పతంగుల పండగ: మంత్రి జూపల్లి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అంతర్జాతీయ పతంగుల ఉత్సవం,స్వీట్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్ కార్యక్రమం, డ్రోన్ షోలను నిర్వహిస్తున్నట్లు పర్యాటక-సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. పర్యాటక రంగానికి మరింత ఆదరణ కల్పించడమే లక్ష్యంగా 'సెలబ్రేట్ ది స్కై' పేరుతో ఈ నెల 13 నుంచి 18 వరకు ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం పలు రాయితీలు ఇస్తోందన్నారు.
వివరాలు
పీపీపీ విధానంలో టూరిజం అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు
పీపీపీ విధానంలో టూరిజం అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. టూరిజం కాన్క్లేవ్, గ్లోబల్ సమిట్ ద్వారా రూ.22,324 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయని, వాటి ద్వారా సుమారు 90 వేల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ క్రాంతి వల్లూరి, నిథమ్ డైరెక్టర్ వెంకటరమణతో పాటు కల్చర్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ (క్లిక్) సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.