
Zepto: ఐటీ ఉద్యోగినిపై జెప్టో డెలివరీ బాయ్ అత్యాచారయత్నం.. పట్టించుకోని సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ 'జెప్టో' డెలివరీ బాయ్ అత్యాచారయత్నం చేసిన ఘటన చెన్నైలోని కుబేరన్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ ఐటీ ఉద్యోగిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో డెలివరీ బాయ్ అత్యాచారయత్నానికి పాల్పడటంతో ఈ సంఘటన సంచలనం రేపింది. మడిపాక్కంకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని జెప్టో యాప్ ద్వారా కిరాణా సరుకులను ఆర్డర్ చేసింది. గోపీనాథ్ అనే డెలివరీ బాయ్ సరుకులను డెలివరీ చేసి, సెల్ఫోన్ చార్జింగ్ లేదని, ఎమర్జెన్సీ అని చెప్పి కొంతసేపు ఇంట్లో ఫోన్ ఛార్జ్ పెట్టుకోవాలని కోరాడు. బాధిత మహిళ నమ్మకంతో గోపీనాథ్ను ఇంట్లోకి అనుమతించింది.
Details
పోలీసులను అశ్రయించిన బాధిత మహిళ
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గోపీనాథ్ ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. యువతి గట్టిగా కేకలు వేయడంతో డెలివరీ బాయ్ ఇంట్లో నుంచి పరారయ్యాడు. శబ్దం విని చుట్టుపక్కల వారు ఇంట్లోకి వెళ్లి చూసే సరికి మహిళ తీవ్ర భయాందోళనకు గురై ఉంది. ఆమె జరిగిన ఘటనను వివరించగా, స్థానికులు జెప్టో సంస్థకు ఫిర్యాదు చేశారు. కానీ జెప్టో నుంచి స్పందన రాకపోవడంతో ఐటీ ఉద్యోగిని నేరుగా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి డెలివరీ బాయ్ గోపీనాథ్ను అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటనపై బాధిత మహిళ విషయాన్ని జెప్టో సంస్థకు తెలిపినా ఎటువంటి స్పందన రాకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.