Jharkhand Paper Leak : జార్ఖండ్లో పేపర్ లీక్పై నిరసనలు.. 600 మంది విద్యార్థులపై కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
జార్ఖండ్లో పేపర్ లీక్ ఆరోపణలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు సంబంధించి పోలీసులు తాజాగా 600 మందిపై కేసులు నమోదు చేశారు. కేసులు ఎదుర్కొంటున్న వారిలో సుమారు 500 మంది గుర్తుతెలియని విద్యార్థులు ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) నిర్వహించిన పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిందనే ఆరోపణలపై విద్యార్థులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాలు గురువారంతో 20వ రోజుకు చేరుకున్నాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడంతో పాటు, పేపర్ లీక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
వివరాలు
అసెంబ్లీ ముట్టడితో ఉద్రిక్తత
సోమవారం విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.
ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.
పరిస్థితిని నియంత్రించేందుకు వాటర్ క్యానన్లను ఉపయోగించడంతో పాటు భాష్పవాయువును ప్రయోగించారు.
పోలీసుల చర్యలను నిరసిస్తూ బీజేపీ మరుసటి రోజు జార్ఖండ్ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది.
వివరాలు
డిమాండ్లు నెరవేర్చే వరకు వెనక్కి తగ్గేది లేదన్న విద్యార్థులు
పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించే వరకు ఆందోళనలను విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.
జేపీఎస్-జేఎస్ఎస్సీ మంచ్ ఆధ్వర్యంలో రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి.
పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత తీసుకురావాలని విద్యార్థులు కోరుతున్నారు.
పేపర్ లీక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అలాగే పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐతో లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన మాజీ న్యాయమూర్తులతో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నారు.
వివరాలు
నిరాహార దీక్షకు దిగుతానన్న మాజీ సీఎం
ఇదిలా ఉండగా.. విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం మరో వారంలోగా పరిష్కరించకపోతే తాను నిరాహార దీక్షకు దిగుతానని మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ బుధవారం హెచ్చరించారు.
మరోవైపు విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా దేశవ్యాప్తంగా 1200 విశ్వవిద్యాలయాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) వెల్లడించింది.