Page Loader
Carcinogenic idli preparation: ఇడ్లీలను ఆవిరి చేయడానికి వాడే ప్లాస్టిక్ పై కర్ణాటక సర్కార్ నిషేధం 
ఇడ్లీలను ఆవిరి చేయడానికి వాడే ప్లాస్టిక్ పై కర్ణాటక సర్కార్ నిషేధం

Carcinogenic idli preparation: ఇడ్లీలను ఆవిరి చేయడానికి వాడే ప్లాస్టిక్ పై కర్ణాటక సర్కార్ నిషేధం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2025
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని హోటళ్లలో హానికరమైన పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యంగా,ఇడ్లీల తయారీలో పలుచని పాలిథిన్ షీట్ల వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరికలు జారీ చేసింది. ఈ అంశంపై సీరియస్‌గా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం,ప్లాస్టిక్ వాడకంపై దర్యాప్తు చేపట్టింది. ఆరోగ్యానికి ముప్పు పాలిథిన్ షీట్ల వినియోగం ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు వెల్లడించారు. తక్కువ నాణ్యత కలిగిన ప్లాస్టిక్ పదార్థాలు ఆహారంలో కలిసిపోతే,అది కేన్సర్ సహా ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇలాంటి అనారోగ్యకరమైన పద్ధతులను అనుసరిస్తున్న హోటళ్లపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

వివరాలు 

హోటళ్లపై తనిఖీలు 

ఆహార భద్రతా శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 251 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా, బెంగళూరు సహా వివిధ నగరాల్లో 52 హోటళ్లు ఇడ్లీల తయారీలో పలుచని పాలిథిన్ షీట్లు వాడుతున్నట్లు గుర్తించారని గుండూరావు తెలిపారు. చాలాకాలంగా ఇడ్లీలను ఆవిరి చేయడానికి కాటన్ బట్టలు ఉపయోగించేవారు.అయితే,కొంతమంది హోటల్ యజమానులు తాజాగా ప్లాస్టిక్ షీట్లను ఉపయోగించడం ప్రారంభించారని ఆయన వెల్లడించారు. ఉల్లంఘనలపై కఠిన చర్యలు ప్లాస్టిక్ షీట్ల వినియోగంపై ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టిందని,ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి గుండూరావు హామీ ఇచ్చారు. ఆరోగ్యాన్నికాపాడే దిశగా,ఆహార తయారీ ప్రక్రియల్లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు ఇలాంటి ఆరోగ్యానికి హానికరమైన పద్ధతులను గమనిస్తే, తక్షణమే అధికారులకు తెలియజేయాలని కోరారు.

వివరాలు 

గతంలో కూడా.. 

గతంలో గోబీ మంచూరియన్, కాటన్ మిఠాయి వంటి వంటకాల్లో విరివిగా ఉపయోగించే హానికరమైన ఫుడ్ కలరింగ్ ఏజెంట్ రోడమిన్-బిపై కూడా కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆహార భద్రతను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటుందని గుండూరావు స్పష్టం చేశారు. ''ఇలాంటి హానికరమైన పదార్థాలను ఉపయోగించినవారికి ఏడేళ్ల జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తాం'' అని ఆయన హెచ్చరించారు.