Delhi: దిల్లీలో యమునా నది నీటిమట్టం ఆల్ టైమ్ హై; 45ఏళ్ల రికార్డు బద్దలు; కేజ్రీవాల్ ఆందోళన
దిల్లీలో యమునా నది నీటి మట్టం బుధవారం మధ్యాహ్నం 1గంట సమయానికి 207.55మీటర్లకు చేరుకుంది. దీంతో యమునా నది నీటిమట్టం ఆల్ టైమ్ హైకి చేరుకుంది. యమునా నది నీటి మట్టం 45ఏళ్ల క్రితం(1978లో) అత్యధికంగా 207.49 మీటర్లకు చేరుకొని ఆల్-టైమ్ రికార్డ్ను నమోదు చేసింది. తాజాగా ఆ రికార్డు బుధవారం బద్ధలైంది. దీంతో దిల్లీని వరదల భయం వెంటాడుతోంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ యమునా నదిలో పెరుగుతున్న నీటిమట్టంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. యమునాలో నీటిమట్టం బధువారం అర్ధరాత్రికి 207.72 మీటర్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం అంచనా చేసింది. అయితే దిల్లీకి అది ఏ మాత్రం మంచిది కాదని కేజ్రీవాల్ అన్నారు.
లోతట్టు ప్రాంతాలలో ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్
దిల్లీలో గత 2రోజులు వర్షాలు లేకపోయినా నీటిమట్టాలు పెరుగుతున్నాయని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. హత్నికుండ్ బ్యారేజీ వద్ద హర్యానా అసాధారణంగా అధిక పరిమాణంలో నీటిని విడుదల చేయడం వల్ల యమునా మట్టాలు పెరుగుతున్నాయని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. కేంద్రం జోక్యం చేసుకుని యమునాలో మట్టాలు మరింత పెరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని దిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి అతిషి తెలిపారు. యమునా నది నీటిమట్టం పెరిగినందున లోతట్టు ప్రాంతాలలో రెస్క్యూ యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్లు పేర్కొన్నారు. దిల్లీలో అత్యధికంగా 1924, 1977, 1978, 1995, 2010, 2013లో భారీ వరదలు సంభవించాయి.