Kerala : కేరళలో ఘోరం..తాత కారు కింద పడి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఈ మేరకు తన తాత కారు కింద పడి రెండేళ్ల పసివాడు నలిగిపోయాడు. దీంతో ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన కేరళలోని కాసరగోడ్ జిల్లాలో జరిగింది. ఇదే సమయంలో ప్రమాదం బాధిత కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. కారు పార్కింగ్ చేస్తోన్న సమయంలో ఈ ఘోరం జరగడం గమనార్హం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా తీవ్ర భావోద్వేగాన్ని నింపింది. అసలేం జరిగిందంటే : ఇద్దరు చిన్నారులు (సోదరులు) ఇంటి ముందు ఆడుకుంటున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఒక కారు లోపలికి వచ్చేసింది. కారును గమనించిన ఓ చిన్నారి తాత అంటూ కారుకు ఎదురుగా వెళ్లాడు.
మనవడి దుస్థితికి తీవ్ర ఆందోళన చెందిన తాత
కానీ మనవడి రాకను తాత గమనించలేకపోయారు. ఈ క్రమంలోనే వాహనాన్ని పార్కింగ్ చేసేందుకు పక్కకు తిప్పడంతో దాని టైర్ కింద పడ్డ సదరు చిన్నారి నలిగిపోయాడు. అక్కడే ఆడుకుంటున్న చిన్నారి సోదరుడు మరో బాలుడు ఈ ఘటనను గుర్తించాడు. దీంతో కేకలు వేయడంతో ఏదో ప్రమాదం జరిగిందని కారులోని తాత కిందికి దిగాడు. ఇంతలోనే అక్కడున్న పిల్లాడు కారు కింద నలుగుతున్న చిన్నారిని బయటకు లాగేందుకు ప్రయత్నించాడు. ఈ మేరకు కారు కింద నలిగిపోయిన మనవడిని చూసి తాత తీవ్ర ఆందోళన చెందారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఆ చిన్నారి తీవ్రంగా గాయాలపాలవడంతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నివాసంలోని సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.