
South Central Railway: దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన ప్రక్రియలో కీలక అడుగులు.. రైల్వే బోర్డుకు చేరిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన ప్రక్రియ వేగం పుంజుకుంటోంది.
ఇందులో భాగంగా డివిజన్ల విభజన,సరిహద్దుల్లో మార్పులు,ఆదాయ పంపిణీ,రైళ్ల నిర్వహణ వంటి అంశాలతో కూడిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ - DPR) రైల్వే బోర్డుకు చేరింది.
ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు విశాఖపట్టణం కేంద్రంగా ఏర్పాటు చేయబోయే దక్షిణ కోస్తా జోన్ కోసం ఇటీవలే రైల్వే బోర్డు జనరల్ మేనేజర్ (జీఎం) నియమించింది.
త్వరలో మరో ముగ్గురు అధికారులను ఈ జోన్ కోసం నియమించనున్నారు.
వీరే కొత్త, ప్రస్తుత జోన్ల మధ్య సరిహద్దులు, ఆదాయ విభజన విధానాలపై నిర్ణయం తీసుకునే బృందంగా వ్యవహరించనున్నారు.
వివరాలు
విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్ హామీకి అమలు దిశగా
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీని అనుసరించి, ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర క్యాబినెట్ దానికి ఆమోదం తెలిపింది.
ఆ ఆమోదం మేరకు దక్షిణ కోస్తా జోన్కు సంబంధించి DPRను జోన్కి నియమించబడిన ఓఎస్డీ (అఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) గత నెలలో రైల్వే బోర్డుకు సమర్పించారు.
ప్రస్తుతం ఈ నివేదిక బోర్డు పరిశీలనలో ఉంది. ఇదిలా ఉండగా, కేంద్ర హామీలపై పనిచేసే పార్లమెంటు అస్యూరెన్స్ కమిటీ ఈ గురువారం విజయవాడను సందర్శించనున్నట్టు సమాచారం.
కేంద్రం, మంత్రులు పార్లమెంటులో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయన్న విషయాన్ని కమిటీ పరిశీలించనుంది.
వివరాలు
రహస్యంగా ఉంచిన డీపీఆర్ వివరాలు
రైల్వే అధికారులు డీపీఆర్లోని సమాచారం గోప్యంగా ఉంచినట్లు సమాచారం.
ఈ నివేదికను అస్యూరెన్స్ కమిటీకి అందించలేదని తెలుస్తోంది. కమిటీకి పంపిన నోట్లో 'రాయగడ డివిజన్ పరిధి, విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు' అనే వివరాలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో రాయగడ డివిజన్ను ఏర్పాటుచేస్తామని కొంతకాలం క్రితం ప్రకటించారు.
ఈ డివిజన్ పరిధిలో ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన కొన్ని ప్రాంతాలు చేర్చబడే అవకాశముంది.
వివరాలు
కొత్త జోన్ ఏర్పాటుకు వేగం పెరుగుతోంది
ప్రస్తుతం దక్షిణ కోస్తా జోన్కి డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) స్థాయిలో అధికారి మాత్రమే ఉండగా, ఐదు రోజుల క్రితం రైల్వే బోర్డు జీఎంగా సందీప్ మాథుర్ను నియమించింది.
ఒక జోన్లో అత్యున్నత హోదా గల అధికారి జనరల్ మేనేజర్నే కావడంతో, ఈ నియామకం జోన్ ఏర్పాటుకు ఊతమిచ్చే పరిణామంగా భావిస్తున్నారు.
రైల్వే బోర్డు డీపీఆర్కు ఆమోదం ఇచ్చిన వెంటనే విభజన ప్రక్రియ మరింత వేగం పొందుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
డివిజన్ల సరిహద్దుల్లో కీలక మార్పులు
ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్లో మొత్తం ఆరు డివిజన్లు ఉన్నాయి.
పునర్విభజన తర్వాత డివిజన్ల సరిహద్దుల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలున్నాయి.
పునర్విభజన అనంతరం సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఉంటాయి.
ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు కొత్తగా ఏర్పడే దక్షిణ కోస్తా జోన్లోకి వెళ్లనున్నాయి.
వీటితో పాటు విశాఖపట్నం కేంద్రంగా కొత్త డివిజన్ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో దక్షిణ కోస్తా జోన్లో మొత్తం నాలుగు రైల్వే డివిజన్లు ఏర్పడతాయి.