Kishan Reddy: హైదరాబాద్ మెట్రో రెండో దశ పురోగతిపై సీఎం రేవంత్కు కిషన్రెడ్డి లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన తాజా పరిణామాలను, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చలను ఆయన వివరించారు. ఇప్పటికే మెట్రోను L&T నుంచి స్వాధీనం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని సీఎం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ నేపథ్యంలో తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను కలిసి హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణంపై చర్చించినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆ సమావేశంలో ఖట్టర్, ముందుగా మెట్రో మొదటి దశను పూర్తిగా L&T నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలిపారు.
Details
రెండో దశ నిర్మాణానికి కేంద్రం అంగీకారం
దీనికి సంబంధించిన ఒప్పందాలు, నిర్ణయాలు, లావాదేవీలు పూర్తి అయిన తర్వాతే రెండో దశ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెల్లడించినట్లు లేఖలో పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకారం తెలిపిన విషయాన్ని కూడా ఖట్టర్ గుర్తు చేశారని కిషన్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా, మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం L&T నుంచి స్వాధీనం చేసుకోవడం, రెండో దశ నిర్మాణానికి అవసరమైన సన్నాహాల కోసం కేంద్ర ప్రభుత్వం-రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలనే అంశాన్ని సీఎంతో చర్చించి నిర్ణయించామని ఖట్టర్ తెలిపినట్లు కిషన్ రెడ్డి వివరించారు.
Details
రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇద్దరు
ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు, కేంద్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారులు ఉండేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారుల పేర్లు ప్రతిపాదించలేదని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారుల పేర్లు పంపించాలని కిషన్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు.