
Kodali Nani: దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం గుడివాడ కోర్టుకు కొడాలి నాని
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత,మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి గుడివాడలో ప్రజల మధ్యకు వచ్చారు. శుక్రవారం నాడు ఓ దాడి కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం గుడివాడ కోర్టులో హాజరయ్యారు. గత కొన్ని నెలలుగా రాజకీయ రంగానికి దూరంగా ఉన్న నాని ఒక్కసారిగా కోర్టు ప్రాంగణంలో ప్రత్యక్షం కావడంతో వైసీపీ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే, మాజీ ఎమ్మెల్యే అయిన రావి వెంకటేశ్వరరావు ప్రస్తుతం వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన వస్త్ర దుకాణంపై జరిగిన దాడి ఘటనపై కొడాలి నానిపై కేసు నమోదైంది.
వివరాలు
గుడివాడ కోర్టుకు వచ్చిన కొడాలి
అరెస్టును నివారించేందుకు నాని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, గుడివాడలోని కింది కోర్టులోనే బెయిల్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం నాని శుక్రవారం గుడివాడ కోర్టుకు వచ్చి బెయిల్ పొందేందుకు అవసరమైన పత్రాలు సమర్పించారు. ఇదే కేసులో ఇప్పటికే నానితో పాటు ఉన్న 16 మంది అనుచరులకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
వివరాలు
నాని రాకతో కోర్టు ప్రాంగణానికి భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు
అయితే, పోలీసుల విచారణ సమయంలో కొందరు అనుచరులు కొడాలి నాని ఆదేశాల మేరకే తాము దాడికి పాల్పడినట్లు అంగీకరించారని సమాచారం. ఎన్నికల అనంతరం సుమారు సంవత్సరం పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్న కొడాలి నాని గుడివాడ కోర్టుకు రావడం స్థానిక రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. ఆయన వస్తున్న విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కోర్టు వద్దకు భారీగా చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.