Komuravelli Mallanna : కల్యాణానికి ముస్తాబవుతున్న కొమురవెళ్లి మల్లన్న .. రెండు రోజుల పాటు ఉత్సవాలు
తెలంగాణలో శివభక్తుల కొంగుబంగారం కొమురవెల్లి మల్లన్న (మల్లికార్జున స్వామి) కల్యాణానికి ముస్తాబవుతున్నారు. ఈ నెల 7న(ఆదివారం) అంగరంగ వైభవంగా రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రాల భక్తులు సైతం భారీగా హాజరుకానున్నారు. ఈ మేరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, దాతలు, ఉన్నతాధికారులు, భక్తులకు స్వామి కల్యాణ ఆహ్వాన పత్రాలను ఆలయ అధికారులు అందిస్తున్నారు. 7న ఉదయం 5 గంటలకు స్వామివారికి దృష్టికుంభం (బలిదానం), 10-45 గంటలకు స్వామికల్యాణం, అనంతరం ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 7 గంటలకు రథోత్సవం. 8న సోమవారం ఉదయం 9 గంటలకు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన, మహామంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, మంత్ర పుష్పం, తీర్థప్రసాద వితరణ లాంటివి జరిపించనున్నారు.
అంగరంగా వైభవంగా స్వామి వారి కల్యాణం
వివాహ మహోత్సవ పత్రిక.. వరుడు : మల్లికార్జున స్వామి వధువులు : మేడలాదేవి, కేతమ్మ దేవి సుముహూర్తం : స్వస్తిశ్రీ శోభకృత్ సంవత్సరం మాసం : మార్గశిర మాసం ఏకాదశి (07.01.2024 ఆదివారం), ఉదయం : 10-45 గం. కల్యాణ వేదిక : కొమురవెల్లి క్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో తోట బావి కన్యాదాతలు : మహాదేవ వంశస్థులు లబ్ధిదారులు : పడిగంగారి వారసులు వైదిక పర్యవేక్షణ : 1008 వీరశైవ పీఠాధిపతి మణికంఠ శివాచార్యుల నేతృత్వం అర్చకులు : నడిపూడి మఠం భవనయ్య స్వామి, భువనేశ్వర స్వామి, ఆనందయ్య, జ్ఞానేశ్వర శాస్త్రి, చంద్రశేఖర్ స్వామి, భద్రయ్యస్వామి వ్యాఖ్యాతలు : డాక్టర్ మహంతయ్య, నందుల మఠం శశిభూషణ సిద్ధాంతి స్వామీజీ ఆహ్వానితులు : ఆలయ కార్యనిర్వహణాధికారి, వీరశైవ అర్చకులు, అర్చకుల బృందం, ఆలయ సిబ్బంది.