
KTR: 'ఎకో పార్క్ ముసుగులో భూకబ్జా'.. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!
ఈ వార్తాకథనం ఏంటి
కంచ గచ్చిబౌలి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పరిసర ప్రాంతాల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు 400 ఎకరాల భూ వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు, పర్యావరణవేత్తలకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
ఈ భూమిలో వందలాది వృక్ష జాతులు, పక్షులు, జంతువుల నివాసం ఉన్నట్లు చెబుతూ ఈ ప్రాంతాన్ని ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఆర్థిక లబ్ధి కోసం ప్రభుత్వం పర్యావరణాన్ని తాకట్టు పెడుతోందని విమర్శించారు. హెచ్సీయూ విద్యార్థులు అడవిని కాపాడేందుకు శాంతియుతంగా చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు ఇచ్చారు.
వారి మీద నిందలు వేయడాన్ని, యూనివర్సిటీని తరలిస్తామని బెదిరింపులు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
Details
ఎకో పార్క్ పేరుతో మోసపూరిత ప్రణాళిక
ఇది ప్రభుత్వ రియల్ ఎస్టేట్ ధోరణికి నిదర్శనమని అన్నారు. ఎకో పార్క్ పేరుతో ప్రభుత్వం మోసపూరిత ప్రణాళికతో ముందుకెళ్తోందని కేటీఆర్ ఆరోపించారు.
ఇది అడవిని కాపాడాలన్న బదులు భూములను ఆక్రమించేందుకు చేస్తున్న కుట్ర అని పేర్కొన్నారు. విద్యార్థుల నిరసనలను అణిచివేయడంపై తీవ్ర విమర్శలు చేశారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరలింపు విషయంలో వస్తున్న హెచ్చరికలను ఖండించిన కేటీఆర్, ఇది ప్రభుత్వం చేతగానితనానికి సంకేతమని అన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ తరపున గచ్చిబౌలి, హెచ్సీయూ అడవులను కాపాడుతామని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి, భూముల అమ్మకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.