అధికార, ప్రతిపక్షా తీరుపై కలత చెందిన లోక్సభ స్పీకర్; సమావేశాలకు గైర్హాజరు
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కలత చెందినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంపై అధికార, ప్రతిపక్షాలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎంపీలు సభ గౌరవానికి అనుగుణంగా ప్రవర్తించే వరకు తాను సమావేశాలకు హాజరు కాబోనని ఓం బిర్లా చెప్పినట్లు ఆయన సన్నిహిత వర్గాలు బుధవారం తెలిపాయి. లోక్సభ కార్యకలాపాలు బుధవారం ప్రారంభమైనప్పుడు బిర్లా స్పీకర్ గా రాకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. లోక్సభలో బుధవారం కూడా పెద్దఎత్తున నిరసనలు కొనసాగాయి. మధ్యాహ్నం 2గంటల తర్వాత సభను గురువారానికి వాయిదా వేశారు.
సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి అంతరాయాలే
వాస్తవానికి దిల్లీ సర్వీసెస్ బిల్లు ( గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023) దిగువ సభలో ఆమోదం పొందాల్సి ఉంది. మణిపూర్ అంశంపై గందరగోళం నేపథ్యంలో దిల్లీ బిల్లు చర్చకు రాలేదు. ఇలా పలు సందర్భాల్లో లోక్సభలో బిల్లుల ఆమోదం నేపథ్యంలోవిపక్షాలు ప్రవర్తనతో బిర్లా కలత చెందినట్లు తెలుస్తోంది. సభను స్పీకర్ అత్యంత గౌరవంగా చూస్తారని, సభా కార్యకలాపాల సమయంలో సభ్యులు మర్యాదపూర్వకంగా ఉండాలని ఆశిస్తున్నారని ఆయన సన్నిహత వర్గాలు చెబుతున్నాయి. జులై 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పదే పదే పార్లమెంట్లో అంతరాయాలు చోటుచేసుకోవడంపై స్పీకర్ అసంతృప్తిని ప్రతిపక్షాలు, ట్రెజరీ బెంచ్లకు తెలియజేయడం జరిగింది.