Page Loader
మధ్యప్రదేశ్‌లో నేలరాలిన పులి పిల్ల.. బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఆడపులి మృతి 
బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఆడపులి మృతి

మధ్యప్రదేశ్‌లో నేలరాలిన పులి పిల్ల.. బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఆడపులి మృతి 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 10, 2023
02:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లోని పులుల సంక్షరణ కేంద్రంలో పులుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆడ పులిపిల్ల మరణించింది. ఇప్పటికే కునో నేషనల్‌ పార్క్‌లో వరుసగా చీతాల మరణాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌లో 7 నెలల వయసు గల ఆడపులి పిల్ల అనుమానాస్పదంగా మరణించింది. మరో పులితో జరిగిన ఘర్షణలో ఈ ఆడ పులి చనిపోయిందని అక్కడి అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (ACF)ఎఫ్‌ఎస్‌ నినామా వెల్లడించారు. ఘటనా స్థలంలో మరో పులికి సంబంధించిన పాదముద్రలు కనిపించినట్లు పేర్కొన్నారు. దీని మరణంపై విచారణ కొనసాగుతోంది.ఇందుకోసం డాగ్ స్క్వాడ్‌ను సైతం రంగంలోకి దించినట్లు ఎఫ్‌ఎస్‌ నినామా వెల్లడించారు.

DETAILS

ఒక్క మధ్యప్రదేశ్‌లోనే 785 వరకు పులులు ఉన్నట్లు నివేదిక

మరోవైపు కూనో పార్కులో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన చీతాల్లో ఇప్పటికే 9 మరణించడం ఆందోళనకరంగా మారింది. జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ ఓ నివేదిక రిలీజ్ చేసింది. ఇందులో పేర్కొన్న గణాంకాల ప్రకారం ఒక్క మధ్యప్రదేశ్‌లోనే 785 వరకు పులులున్నట్లు వివరించింది. కర్ణాటకలో 563, ఉత్తరాఖండ్‌లో 560, మహారాష్ట్రలో 444 పులులున్నట్లు నివేదించింది. 1.కన్హా టైగర్ రిజర్వ్ 2.బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ 3.పన్నా టైగర్ రిజర్వ్ 4.పెంచ్ టైగర్ రిజర్వ్ 5.సాత్పురా టైగర్ రిజర్వ్ 6.సంజయ్-దుబ్రి టైగర్ రిజర్వ్‌లు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండటం విశేషం. అత్యధికంగా బాంధవ్‌గఢ్‌ లో 135 పులులు ఉన్నాయి. ఖానా రిజర్వులో 105, పెంచ్‌లో 77 చొప్పున ఉన్నట్లు వెల్లడైంది.