
Karnataka: ఆవును చంపిందన్న కోపంతో.. పులులకు విషం పెట్టిన వ్యక్తి అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోని కర్ణాటక రాష్ట్ర చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలో ఉన్న మలెమహదేశ్వర వన్యప్రాంతంలో ఇటీవల ఐదు పులులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటనపై అటవీ శాఖ అధికారులు విచారణ జరిపారు. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో పులులకు విషం పెట్టి చంపిన ఘటనకు సంబంధించి ముగ్గురిని అధికారులు అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన మాదురాజు అనే వ్యక్తి తన ఆవును పులి వేటాడి చంపిన ఘటనపై తీవ్ర ఆవేదనకు గురై, ప్రతీకార చర్యకు పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. మాదురాజు తనకు ఎంతో ప్రియమైన 'కెంచి' అనే ఆవును ఆ పులి చంపడంతో క్షోభకు లోనయ్యాడు.
Details
నాలుగు కూనలు మృతి
పులిని ఎలా అయినా చంపాలన్న ఉద్దేశంతో తన స్నేహితులు కోనప్ప, నాగరాజులతో కలిసి పథకం రచించాడు. అదే క్రమంలో చనిపోయిన ఆవు కళేబరంపై విషం పూసి, దానిని అడవికి సమీపంలో వదిలేశాడు. ఆ విషపు మాంసాన్ని తిన్న ఓ తల్లి పులితో పాటు నాలుగు కూనలు మృతి చెందాయి. ఈవిషయంపై విచారణ చేపట్టిన అటవీశాఖ అధికారులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం వారిని మీణ్యం ప్రాంతంలోని అరణ్య భవన్కు తరలించారు. ఈఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పూర్తి నివేదిక అందిన తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రేకు సూచించారు. వన్యప్రాణుల సంరక్షణకు ఈ ఘటన గంభీర హెచ్చరికగా మారింది.