Karnataka: కర్ణాటక హైకోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. షాకైన సిబ్బంది
కర్ణాటక హైకోర్టులోని కోర్టు రూమ్ నంబర్ 1లో విచారణ జరుగుతోంది. ప్రధాన న్యాయమూర్తి నిలయ్ విపిన్చంద్ర అంజరియా అక్కడ ఉన్నారు. అప్పుడు హఠాత్తుగా ఒక వ్యక్తి కోర్టు గదిలోకి ప్రవేశించి ప్రధాన న్యాయమూర్తి ముందు కత్తితో గొంతుకోసుకున్నాడు. ఇది చూసిన కోర్టు హాలులో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రధాన న్యాయమూర్తికి కూడా ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే భద్రతా సిబ్బంది గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఆ వ్యక్తి ఇలా ఎందుకు చేశాడో ఎవరికీ తెలియదు. పరిస్థితి మెరుగయ్యే వరకు అతని నుంచి వాంగ్మూలం తీసుకోలేమని పోలీసులు తెలిపారు.
భద్రతా లోపాలపై ప్రధాన న్యాయమూర్తి అంజరియా ఆందోళన
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూరుకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టు రూమ్ నంబర్ 1 ప్రవేశద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బందికి ఫైలును అందజేశాడని,ఎవరికీ ఏమీ అర్థం కాకముందే ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో గొంతు కోసుకోవడానికి ప్రయత్నించాడు. హైకోర్టు ప్రాంగణంలో భద్రతా లోపాలపై ప్రధాన న్యాయమూర్తి అంజరియా ఆందోళన వ్యక్తం చేశారు. పదునైన ఆయుధంతో ఆ వ్యక్తి కోర్టు ఆవరణలోకి ఎలా ప్రవేశించాడని సెక్యూరిటీ చూస్తున్న వారిని ప్రశ్నించారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలను రికార్డు చేయాలని పోలీసులను ఆదేశించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.