
Meena: ఢిల్లీలో ఉపరాష్ట్రపతిని కలిసిన మీనా.. కాషాయ కండువా కప్పుకొనే అవకాశం?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీనా ఇటీవల దిల్లీ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను కలిశారు. ఈ సందర్భానికి సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'మిమ్మల్ని కలవడం గౌరవకరం. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. అది నా భవిష్యత్తును నమ్మకంగా నడిపించడంలో ఎంతో సహకరిస్తుంది. మీ సమయానికి ధన్యవాదాలని మీనా రాశారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ భేటీతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆమె బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ మీడియా కూడా ఈ వార్తలను ప్రాధాన్యంగా ప్రసారం చేస్తోంది.
Details
బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహాం
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అన్నాడీఎంకే-బీజేపీ మధ్య ఇప్పటికే పొత్తు కుదిరింది. తమిళనాడులో అధికారం చేజిక్కించుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులను పార్టీలో చేర్చుకోవాలని కాషాయ పార్టీ యోచిస్తోంది. ఇప్పటికే ఖుష్బూ బీజేపీలో చేరగా, మరికొందరు సినీ తారలను పార్టీలో చేర్చుకుని బలం పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మీనా ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉపరాష్ట్రపతితో భేటీ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
Details
బీజేపీలో చేరే అవకాశం
ఆమె త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. తన వ్యక్తిగత జీవితానికి వచ్చేస్తే, 2009లో మీనా వ్యాపారవేత్త విద్యాసాగర్తో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. 2022లో తీవ్ర అనారోగ్యంతో విద్యాసాగర్ కన్నుమూశారు. అప్పటి నుంచి మీనా కుమార్తెతోనే జీవిస్తున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీరంగంలో రాణించిన ఆమె ఇప్పుడు రాజకీయాలపై దృష్టిసారించినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.